భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-08-07T06:20:10+05:30 IST
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేపడుతున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
కరీంనగర్, ఆగస్టు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా చేపడుతున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శనివారం భారత వజ్రోత్సవాలలో చేపట్టవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావ రణంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఈ నెల 8 నుంచి 22 వరకు కార్యక్రమా లను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అన్నారు. 8న నిర్వహించే ప్రారంభ కార్యక్రమానికి జిల్లాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతుబంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్మన్లు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:15 నిమిషాల వరకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు చూసే విధంగా చర్యలు తీసుకో వాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జిల్లా అధికారులతో 8 నుంచి 22 వరకు నిర్వహించవలసిన కార్యక్రమాలపై సమీక్షించారు. వజ్రోత్సవ వేడుకలను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్లాల్, గరిమ అగర్వాల్, డీర్డీఏ పీడీ శ్రీలత, జిల్లా విద్యాధికారి జనార్ధన్రావు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.