చివరి టెస్టుకు కసరత్తులు
ABN , First Publish Date - 2021-03-02T06:49:39+05:30 IST
ఇంగ్లండ్తో జరగబోయే చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగుతోంది. ఈనెల 4 నుంచి జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం లేదా డ్రా లక్ష్యంగా బరిలోకి దిగనుంది...
- నెట్స్లో ఆటగాళ్ల ప్రాక్టీస్
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరగబోయే చివరిదైన నాలుగో టెస్టు కోసం భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగుతోంది. ఈనెల 4 నుంచి జరిగే ఈ మ్యాచ్లో టీమిండియా విజయం లేదా డ్రా లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అలా అయితేనే వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప ఫైనల్లో చోటు దక్కుతుంది. మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో ఇక్కడి వికెట్పై విమర్శలు వచ్చినా కోహ్లీ సేన మాత్రం తమ దృష్టంతా ఇప్పుడు మ్యాచ్పైనే నిలిచింది. ఈసారి బ్యాటింగ్ పిచ్ ఉంటుందనే ఆలోచనతో కెప్టెన్ కోహ్లీ, రహానె, రోహిత్ శర్మ తమ బ్యాటింగ్కు పదును పెడుతున్నారు. రెండో టెస్టులో 11 వికెట్లతో సత్తా చాటిన లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ వీరికి బంతులు వేశాడు. స్పిన్నర్లు, పేసర్ల బంతులను ఈ స్టార్ త్రయం డ్రైవ్, పుల్, ఫ్లిక్ షాట్లతో ఎదుర్కొన్నారు. కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో జట్టు ఆటగాళ్లంతా సోమవారం నెట్స్లో చెమటోడ్చారు. ఈ ప్రాక్టీస్ వీడియోను బీసీసీఐ తమ ట్విటర్ పేజీలో షేర్ చేసింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కొద్దిసేపు కోచ్ రవిశాస్త్రితో.. కెప్టెన్ కోహ్లీతో మాట్లాడడం కనిపించింది. ఇక బ్యాటింగ్ తర్వాత ఫీల్డింగ్ ప్రాక్టీస్ కూడా కొనసాగింది. స్లిప్లో రహానె, రోహిత్ క్యాచ్లను అందుకున్నారు. ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టును 227 పరుగుల తేడాతో కోల్పోయిన భారత్ జట్టు ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక సవాల్ విసిరిన మొతేరా పిచ్పై భారత స్పిన్నర్లు చెలరేగి ప్రత్యర్థిని 112, 81 పరుగులకే పరిమితం చేసి రెండు రోజుల్లోనే మ్యాచ్ను ముగించారు. ప్రస్తుతం 2-1తో భారత జట్టు ఆధిక్యంలో ఉంది.
పిచ్ ఎలా ఉంటుందో..!
ఇంగ్లండ్తో జరిగే నాలుగో టెస్టు పిచ్పై ఇప్పుడు అందరి దృష్టీ నెలకొంది. మొతేరా మైదానంలోనే జరిగిన గులాబీ టెస్టు స్పిన్నర్లకు స్వర్గధామంగా మారడంతో పలువురు మాజీ ఆటగాళ్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. గురువారం నుంచి జరిగే చివరి మ్యాచ్ పిచ్పై కూడా చర్చ జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సరదాగా స్పందించాడు. మైదానంలో బోర్లా పడుకుని తదేకంగా చూస్తున్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. ‘నాలుగో టెస్టుకు పిచ్ ఎలా ఉండబోతోందో’ అనే క్యాప్షన్ పెట్టడం నవ్వులు పూయిస్తోంది. అటు అభిమానులు కూడా ‘నీవుండగా టెన్షన్ ఎందుకు బ్రదర్.. సిమెంట్ పిచ్ అయినా ఫర్వాలేదంటూ స్పందిస్తున్నారు.