వాయుసేనకు కొత్త శక్తి.. భారత్‌కు చేరిన రఫెల్స్

ABN , First Publish Date - 2022-02-24T18:10:35+05:30 IST

దేశ వాయుసేనకు మరింత శక్తినిచ్చే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. బుధవారం నాటికి మొత్తం 35 రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలోకి చేరాయి.

వాయుసేనకు కొత్త శక్తి.. భారత్‌కు చేరిన రఫెల్స్

దేశ వాయుసేనకు మరింత శక్తినిచ్చే రఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్నాయి. బుధవారం నాటికి మొత్తం 35 రఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలోకి చేరాయి. 2016లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 36 రఫెల్ యుద్ధ విమానాల్ని ఫ్రాన్స్, భారత్‌కు అందజేయాలి. ఇప్పటికి 35 విమానాలు రాగా, మరో విమానాన్ని ఏప్రిల్ నాటికి అందజేస్తామని ఫ్రాన్స్ చెప్పింది. ఈ ఒప్పందం విలువ రూ.59,000 కోట్లు. 4.5వ జనరేషన్‌కు చెందిన ఈ విమానాలు చాలా శక్తివంతమైనవి. భారత వైమానిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని, 13 అంశాల్లో ప్రత్యేక మార్పులు చేసి ఈ విమానాల్ని తయారు చేశారు.


రెండు ఇంజిన్లు కలిగిన రఫెల్ ఫ్లైట్స్ 780 కి.మీ. నుంచి 1650 కి.మీ. రేంజ్‌ కెపాసిటీ కలిగి ఉన్నాయి. గాలిలోనే ఇంధనాన్ని నింపుకొనే సామర్ధ్యం వీటికి ఉంది. అత్యధిక ఎత్తులో ఎగరగల ఈ విమానాలు ‘కోల్డ్‌స్టార్ట్’ టెక్నాలజీతో తయారయ్యాయి. దీనివల్ల ఇవి లడఖ్ లాంటి శీతల ప్రదేశాల్లో కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయి. లో బ్యాండ్ జామర్స్ ఉండటం వల్ల ఈ విమానాలు శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలవు. 120 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న శత్రువుల విమానాల్ని కూల్చే సామర్ధ్యం వీటి సొంతం.

Updated Date - 2022-02-24T18:10:35+05:30 IST