చైనీయులకు పర్యాటక వీసాల నిలిపివేత
ABN , First Publish Date - 2022-04-25T12:46:41+05:30 IST
భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ విషమిస్తున్నాయి. చైనా నుంచి వచ్చే పర్యాటకుల వీసాలు ఇక చెల్లబోవని భారత్ ప్రకటించింది. కొవిడ్ వల్ల స్వస్థలాలకు వెళ్లిన భారత విద్యార్థులు తిరిగి వచ్చేందుకు చైనా
చైనా జాతీయుల పర్యాటక వీసాలు రద్దు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ విషమిస్తున్నాయి. చైనా నుంచి వచ్చే పర్యాటకుల వీసాలు ఇక చెల్లబోవని భారత్ ప్రకటించింది. కొవిడ్ వల్ల స్వస్థలాలకు వెళ్లిన భారత విద్యార్థులు తిరిగి వచ్చేందుకు చైనా అంగీకరించకపోవడం ఇందుకు కారణమైంది. చైనాలో వివిధ కోర్సులు చదువుతున్న 20 వేల మంది భారత విద్యార్థులు కోవిడ్ సమయంలో ఇళ్లకు వచ్చారని, వారు మళ్లీ వచ్చేందుకు ఆ దేశం అనుమతించడం లేదని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. థాయిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్కు చెందిన విద్యార్థులను అనుమతించిందని, భారత విద్యార్థులను మాత్రం రానీయడం లేదని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇటీవల భారత దేశం వచ్చినప్పుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. సానుకూలంగా పరిశీలిస్తానని వాంగ్ యి చెప్పినప్పటికీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే చైనా నుంచి దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలు, ఉద్యోగాల కోసం వచ్చే వారికి భారత్ వీసాలు జారీ చేస్తోంది.