లోతుగా పరిశీలన

ABN , First Publish Date - 2021-08-04T05:27:00+05:30 IST

బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తులు, ఆభరణాల పరిశీలన రెండో రోజు కూడా కొనసాగింది. దేవదాయ శాఖ అధికారులు బొబ్బిలి కోటలో మంగళవారం ఆభరణాలను తనిఖీ చేశారు. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబ, ఆలయ అనువంశిక ధర్మకర్త మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సమక్షంలో వేణుగోపాల స్వామి, సీతారాముల వారి అభరణాల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.

లోతుగా పరిశీలన
కోట భాండాగారం నుంచి బయటకు తీసిన నగలు

 బొబ్బిలి కోటలో ఆభరణాల లెక్కింపు 

రెండోరోజూ కొనసాగిన తనిఖీలు

 సీతానగరం(బొబ్బిలి), ఆగస్టు 3: బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆలయ ఆస్తులు, ఆభరణాల పరిశీలన రెండో రోజు కూడా కొనసాగింది. దేవదాయ శాఖ అధికారులు బొబ్బిలి కోటలో మంగళవారం ఆభరణాలను తనిఖీ చేశారు. ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబ, ఆలయ అనువంశిక ధర్మకర్త మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు సమక్షంలో వేణుగోపాల స్వామి, సీతారాముల వారి అభరణాల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. గత కొంత కాలంగా ఆలయ ఆస్తులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు సోమవారం బొబ్బిలి స్టేట్‌బ్యాంక్‌లోని లాకర్‌ ఉన్న ఆభరణాలను దేవాలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చి లెక్కించారు. జాబితా ప్రకారం అన్ని సరిగా ఉన్నట్లు ప్రకటించారు. రెండోరోజు కోటలో భాండాగారంలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను బయటకు తీసి లెక్కించారు. భాండాగారం తాళాలు సరిగా పనిచేయకపోవడంతో వాటిని వెల్డింగ్‌ కట్టర్‌తో తెరిచారు. బంగారం, వెండి తదితర ఆభరణాలు జాబితాలో ఉన్నదానికంటే  అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

లెక్కకు మించి నగలు

దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ భ్రమరాంబ మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ, వేణుగోపాలస్వామి, శ్రీకాకుళం జిల్లా గొల్లసీతారాంపురం ఆలయాలకు సంబంధించిన ఆభరణాలు జాబితా కన్నా అధికంగా ఉన్నాయని గుర్తించామన్నారు. గుల్లసీతారాంపురం ఆలయంలోని ఆభరణాలను బుధవారం పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి నివేదికను అందజేస్తామని ఆమె వెల్లడించారు.  

 ఆభరణాల భద్రతను ప్రభుత్వమే చూసుకోవాలి: సుజయ్‌

 ఆభరణాల లెక్కింపు అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ మంత్రి సుజయ్‌ కృష్ణరంగారావు మాట్లాడుతూ తమ పూర్వీకులు వేణుగోపాలస్వామికి సమర్పించిన నాలుగు వేల ఎకరాలను ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకుని, ఆలయ ఆలనాపాలనను మరింతగా మెరుగుపర్చాలని కోరారు. భూముల లెక్కలు కూడా తేల్చి ఆలయానికి ఆదాయం వచ్చేటట్లు చూడాలన్నారు. పూర్వీకులు స్వామికి ముఖ్యమైన పర్వదినాల్లో వైభవోపేతంగా ఆభరణాలను అలంకరించి ఉత్సవాలు నిర్వహించేవారని గుర్తుచేశారు. ఆభరణాలు కొన్ని బ్యాంకుల్లో భద్రపరిచామని, మరికొన్ని కోట భాండాగారంలో ఉంచామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటిని సంరక్షించడం తమకు పెద్ద సమస్య అని, ప్రభుత్వ స్వాధీనంలో రక్షణ, భద్రత కల్పించాలని కోరారు. తనిఖీల్లో ఆర్‌జేసీ సురేష్‌బాబు, డీసీ పుష్పవర్ధన్‌, శ్రీకాకుళం జిల్లా ఏసీ అన్నపూర్ణ, అసిస్టెంట్‌ కమిషనర్లు వినోద్‌కుమార్‌, బలివాడ వైకుంఠమాధవ్‌, ప్రసాద్‌, సీఐ శోభన్‌బాబు, ఎస్‌ఐ ప్రసాద్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-04T05:27:00+05:30 IST