స్వాతంత్య్ర వేడుకలు విజయవాడలోనే..!
ABN , First Publish Date - 2020-08-07T12:11:45+05:30 IST
స్వాతంత్య్ర వేడుకలు విజయవాడలోనే..!
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
అమరావతి(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది స్వాతంత్య్రదిన వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో నిర్వహించాలని, క్యాంపు కార్యాలయం కూడా తరలించాలని ప్రభుత్వం తొలుత భావించినా... హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం మార్చుకుంది. అమరావతి నుంచి సచివాలయం, క్యాంపు కార్యాలయాల తరలింపుపై ఆగస్టు 14వ తేదీ వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆ లోపు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసేందుకు హైకోర్టు సమయం ఇచ్చింది. అనంతరం రాజధాని తరలింపు విషయంలో తుది విచారణ చేసి అంతిమ తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రదిన వేడుకలను విజయవాడలోని ఎంజీఎం మైదానంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో నిర్వహించే స్వాతంత్య్రదిన వేడుకలను కరోనా నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశించారు.