పెరిగిన విమాన రద్దీ

ABN , First Publish Date - 2020-06-07T08:24:14+05:30 IST

మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రయాణాల రాకపోక లు పెరుగుతున్నాయి.

పెరిగిన విమాన రద్దీ

కోరుకొండ, జూన్‌ 6: మధురపూడి విమానాశ్రయం నుంచి ప్రయాణాల రాకపోక లు పెరుగుతున్నాయి. ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రతి రోజూ హైదరాబాద్‌-రాజమహేంద్రవరం మధ్య ఇండిగో విమాన సర్వీసు నడుపుతున్నారు. దీని ద్వారా ప్రతిరోజూ 72 మంది ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వస్తున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రతిరోజూ 72 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు. అయితే ఈనెల 2న హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఒకరికి, 4వ తేదీన వచ్చిన వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఇక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కూడా భయాందోళనలకు గురవుతున్నారు. వీరు ముగ్గురూ ముంబై నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి రాజమహేంద్రవరం కనెక్టివిటీ ఫ్లైట్‌ ద్వారా వచ్చారు. అయినప్పటికీ రోజూ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇక వారానికి నాలుగు రోజులు చెన్నై-రాజమహేంద్రవరం విమానాశ్రయం మధ్య మరో విమాన సర్వీసు నడుస్తోంది.


ఈ సర్వీసు సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం ఐదున్నర గంటలకు చెన్నై నుంచి వచ్చి ఆరు గంటలకు తిరిగి మధురపూడి నుంచి చెన్నై బయలుదేరుతుంది. ఈ  సర్వీసు ద్వారా రోజూ 72 మంది అటు నుంచి ఇటు, మరో 72 మంది ఇటు నుంచి అటు వెళుతున్నారు. వీరందరికీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల సిబ్బంది కరోనాకు సంబంధించి థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించి పంపిస్తున్నారు. ఇందుకోసం విమానాశ్రయం వద్ద ఏర్పాట్లు చేశారు. ఇది కేవలం ప్రయాణికుల టెంపరేచర్‌ను మాత్రమే తెలియజేస్తుంది. ఆవిధంగా కాకుండా విమాన ప్రయాణికులకు ముందుగానే కరోనా టెస్టు నిర్వహించి తదుపరి ప్రయాణానికి అనుమతిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హైదరాబాద్‌, చెన్నై నుంచి మధురపూడికి వచ్చే ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో కాకినాడ, ఏలూరు, బొమ్మూరు క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. ఈపాస్‌ ఉన్న వారిని మాత్రం నేరుగా హోం క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలకు ఈపాస్‌లు మంజూ రు చేస్తున్నారు. గతంలో 9 సర్వీసులు నడవగా, ఇప్పుడు రెండు నడుస్తున్నాయి.

Updated Date - 2020-06-07T08:24:14+05:30 IST