వైద్యుల క్వారంటైన్‌ సమయం పెంచండి

ABN , First Publish Date - 2020-06-04T09:06:06+05:30 IST

వైద్యుల క్వారంటైన్‌ సమయం పెంచాలని మంత్రి ఈటల రాజేందర్‌కు జూనియర్‌ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు.

వైద్యుల క్వారంటైన్‌ సమయం పెంచండి

నాణ్యమైన పీపీఈ కిట్లు ఇవ్వండి

ఈటలకు జూనియర్‌ డాక్టర్ల వినతి

సానుకూలంగా స్పందించిన మంత్రి

నిమ్స్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో అలజడి

70 మందికి కొవిడ్‌-19 పరీక్షలు

ఆస్పత్రిలో 3 విభాగాలు ఖాళీ

మంత్రి ఈటలకుజూనియర్‌ డాక్టర్ల వినతి


హైదరాబాద్‌/బేగంపేట, జూన్‌3(ఆంధ్రజ్యోతి): వైద్యుల క్వారంటైన్‌ సమయం పెంచాలని మంత్రి ఈటల రాజేందర్‌కు జూనియర్‌ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. వైద్యులకు నాణ్యమైన కిట్లను అందించాలని, ప్రెగ్నెన్సీ పీజీలను డ్యూటీ నుంచి మినహాయించాలని కోరారు. నిమ్స్‌లో కార్డియాలజీ విభాగంలో మరో ముగ్గురు వైద్య సిబ్బందికి కరోనా వచ్చింది. దీంతో నిమ్స్‌లో వైరస్‌ బారిన పడిన సిబ్బంది సంఖ్య 7కు చేరింది. బుధవారం ఉస్మానియాకు చెందిన మరో వైద్య విద్యార్థికి, నిలోఫర్‌లో మరొక వైద్య సిబ్బందికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఉస్మానియాలో ఇప్పటికే 23 మంది సిబ్బంది కొవిడ్‌-19తో బాధపడుతున్నారు. దీంతో కరోనా బారిన పడిన సిబ్బంది సంఖ్య 29కి చేరింది.


ఈ నేపథ్యంలో జూనియర్‌ డాక్టర్లు బుధవారం మంత్రిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కరోనా సోకిన వైద్యులకు నిమ్స్‌లోని మిలీనియం బ్లాక్‌లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రతినిధి గుండగాని శ్రీనివాస్‌ తెలిపారు. ఈ నెల 20 నుంచి జరగాల్సిన వైద్య విద్య పీజీ పరీక్షలను వాయిదా వేయాలని డాక్టర్లు కోరగా.. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, రోజూ 3 వేల మందికి పైగా పేషెంట్లు, సహాయకులు వచ్చే నిమ్స్‌లో కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివిధ విభాగాల హెచ్‌వోడీలతో ఆస్పత్రి డైరెక్టర్‌ మనోహర్‌ బుధవారం సమాలోచనలు జరిపారు. స్పెషాలిటీ బ్లాక్‌లో కరోనా అలజడి తలెత్తడంతో వైద్య సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. 70 మందికి పైగా సిబ్బంది నుంచి సేకరించిన శాంపిల్స్‌ ఫలితాలు గురువారం వస్తాయి. 

Updated Date - 2020-06-04T09:06:06+05:30 IST