ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా పెంపు
ABN , First Publish Date - 2021-05-09T09:16:29+05:30 IST
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు
గత 24గంటల్లో 491 టన్నులు సరఫరా : సింఘాల్
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. గడచిన 24 గంటల్లో అన్ని ఆస్పత్రులకు 491 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేశామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కోరడంతో కేంద్రం 590 టన్నులకు పెంచిందన్నారు. రాష్ట్రానికి సమీపంలో ఉన్న చెన్నై, బళ్లారి ప్లాంట్ల నుంచి సరఫరా చేయాలని కోరామన్నారు. శ్రీహరికోటలోని ఇస్రో వద్ద ఉన్న దాదాపు 100 టన్నుల ఆక్సిజన్ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దాన్ని నెల్లూరు జిల్లాకు సరఫరా చేస్తామని కోరామన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ల డెలివరీ ప్రారంభమైందని సింఘాల్ చెప్పారు. గత 24గంటల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 15,476 రెమ్డెసివర్ ఇంజెక్షన్లను పంపిణీ చేశామన్నారు. రెమ్డెసివర్ను బ్లాక్లో విక్రయించిన వారిని, నకిలీ ఇంజెక్షన్లు చెలామణీ చేస్తున్నవారిపై కేసులు నమోదు చేశామని సింఘాల్ వివరించారు.