ఆర్టీసీ చార్జీలు పెంచడం హేయం
ABN , First Publish Date - 2022-07-02T06:44:31+05:30 IST
ఆర్టీసీ చార్జీలను పెంచి, ప్రజలపై భారాన్ని మోపడం హేయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.
నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు .. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ
అనంతపురం అర్బన, జూలై 1: ఆర్టీసీ చార్జీలను పెంచి, ప్రజలపై భారాన్ని మోపడం హేయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగనరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే ఆర్టీసీ చార్జీలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రయాణీకులపై రూ.2300 కోట్లు భారం పడిందని అన్నారు. ఆర్టీసీ బస్సులను సామాన్యులకు దూరం చేసే నిర్ణయాలను వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెంచిన చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. బస్సుల్లో ప్రయాణించి, పెంచిన చార్జీలపై ప్రయాణీకులకు అవగాహన కల్పించాలని సూచించారు.