రెండు శాఖల్లో ఇన్చార్జి పాలన
ABN , First Publish Date - 2021-06-18T05:13:37+05:30 IST
రుద్రవరం మండలంలో రెండు ప్రధాన శాఖల్లో ఇన్చార్జి పాలన కొనసాగుతున్నది.
- పంచాయతీల్లో కూడా..
రుద్రవరం, జూన్ 17: రుద్రవరం మండలంలో రెండు ప్రధాన శాఖల్లో ఇన్చార్జి పాలన కొనసాగుతున్నది. మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జి ఎంపీడీవోగా వరలక్ష్మి, విద్యాశాఖ కార్యాలయంలో ఇన్చార్జి ఎంఈవోగా అనూరాధ విధులు నిర్వహిస్తున్నారు. మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఇన్చార్జి ఈవోగా సుబ్బరాయుడు కొనసాగుతున్నారు. అలాగే పంచాయతీల్లో కూడా ఇన్చార్జి వ్యవస్థనే కొనసాగుతున్నది. చిత్రేణిపల్లె పంచాయతీకి ఆలమూరు కార్యదర్శి పాములేటి, కోటకొండ పంచాయతీకి చిన్నకంబలూరు పంచాయతీ కార్యదర్శి కళావతి, డి.కొట్టాల పంచాయతీకి ఎల్లావత్తుల కార్యదర్శి పాములేటి, మందలూరు పంచాయతీకి నరసాపురం కార్యదర్శి ఓబులేసు ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటే్షనాయక్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆళ్లగడ్డ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామకృష్ణనాయక్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు.
కొన్నేళ్లుగా.. విద్యాశాఖ ఇన్చార్జి వ్యవస్థలోనే
రుద్రవరం విద్యాశాఖ ఇన్చార్జి వ్యవస్థలో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. మొన్నటి వరకు బాధ్యతలు చేపట్టిన మహబూబ్బాషా కూడా శిరివెళ్ల ఎంఈవోగా ఉంటూ ఇక్కడ ఇన్చార్జిగానే వ్యవహరించారు. మండల పరిషత్ కార్యాలయంలో కూడా మురళీమోహనమూర్తి పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి నేటి వరకు ఎంపీడీవో పోస్టు కూడా ఇన్చార్జి వ్యవస్థలో కొనసాగుతోంది. అలాగే రుద్రవరం పశువైద్యాధికారి పోస్టు కూడా ఇన్చార్జి వ్యవస్థలో కొనసాగుతోంది. ఇన్చార్జి పశువైద్యాధికారిగా మనోరంజన్ప్రతా్ప వ్యవహరిస్తున్నారు. ఇలా మండలంలో ప్రధాన శాఖలైన మండల అభివృద్ధిశాఖ, విద్యాశాఖ, ఆర్డబ్ల్యూఎస్, పశువైద్యశాఖ ఇన్చార్జి వ్యవస్థలో కొనసాగుతున్నాయి.