బియ్యం పంపిణీ పక్కాగా చేపట్టాలి: ఇన్చార్జి కలెక్టర్
ABN , First Publish Date - 2021-03-02T06:59:54+05:30 IST
ఇంటింటికి బియ్యం పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా ఇన్చార్జీ కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్) మార్చి 1: ఇంటింటికి బియ్యం పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా ఇన్చార్జీ కలెక్టర్ రామసుందర్రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ఇన్చార్జీ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి బియ్యం పంపిణీ పై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రామసుందర్రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌకదుకాణం డీలర్లు ఉదయం ఆరున్నర గంటలకు రేషన్ సరుకులను ఎండీయూ వాహనాల ఆపరేటర్లకు ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ కోసం నిత్యావసర సరుకులను అందజేయాలన్నారు. కొంత మంది డీలర్లు రేషన్ బియ్యం పంపిణీ లో వీఆర్వోలు, ఎండీయూ వాహనాల ఆపరేటర్లకు సహకరించటం లేదని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎండీయూ వాహనాల ఆపరేటర్లు రేషన్ పంపిణీ లో ఏ రోజుకారోజు వచ్చిన డబ్బులను రేషన్ డీలర్కు అందజేసి వెంటనే రశీదు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల ఆపరేటర్లు, వీఆర్వోలకు సహకరించని డీలర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పది మంది ఎండీయూ ఆపరేటర్ల పనితీరు పర్యవేక్షణ కోసం డిప్యూటీ తహసీల్దార్ను పర్యవేక్షణాధికారులుగా నియమించామన్నారు. ఎండీయూ ఆపరేటర్లు ఖచ్చితమైన సమయానికి రేషన్ డీలర్ల దగ్గరకు వెళ్లి రేషన్ తీసుకొని ఇంటింటికి రేషన్ పంపిణీ పకడ్భందీగా చేపట్టాలన్నారు. తమకు కేటాయించిన విధులలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమీక్షలో డిఆర్వో పుల్లయ్య, కర్నూలు ఆర్డీవో వెంకటేశు, ఇన్చార్జీ డిఎ్సవో షర్మిల, కర్నూలు అర్భన్ తహసీల్దార్ తిరుపతిసాయి, కల్లూరు తహసీల్దార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.