ఎడతెరిపిలేని వాన
ABN , First Publish Date - 2022-08-10T07:10:41+05:30 IST
జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వాగులు పొంగి పొర్లడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరు తోంది. జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో పంటలు నీటమునిగి మురిగిపోతున్నాయి.
జిల్లాలో 11.2 మి.మీల వర్షపాతం
నీట మునిగిన పొలాలు, లోతట్టు ప్రాంతాలు
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
నాలుగు గేట్ల ఎత్తివేత.. దిగువకు నీటి విడుదల
నిజామాబాద్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వాగులు పొంగి పొర్లడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరు తోంది. జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో పంటలు నీటమునిగి మురిగిపోతున్నాయి. మూడు రోజులుగా వర్షాలు పడుతుండడంతో మంజీర, గోదావరి ద్వారా శ్రీరామసాగర్కు వరద కొనసాగుతోంది. ముసురు వర్షాలు పడుతుండడంతో వ్యవసాయ పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలో మంగళవారం సరాసరి 11.2 మి.మీల వర్షం కురిసింది. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 535.8 మి.మీల వర్షం పడాల్సి ఉండగా 1159.2 మి.మీల వర్షం పడింది. జిల్లాలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ వాతావరణ విభాగం రుద్రూర్ శాస్త్రవేత్తలు తెలిపారు. సగటున 15 మి.మీల నుంచి 120 మి. మీల మధ్య పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద
శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఎగు వ ప్రాంతంలో వర్షాలు పడుతుండడంతో ఈ వరద ప్రభావం కొనసాగుతోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టుల గేట్లను తెరచి దిగువకు విడుదల చేస్తుండం వల్ల ఈ వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 39680 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి నాగులు గేట్ల ద్వారా 16656 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద కాల్వ, కాకతీయ కాల్వ, లక్ష్మికాల్వ, సరస్వతి కాల్వల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకుగాను ప్రస్తుతం 1088.5 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులో 90.3 టీఎంసీలకుగాను 78.022 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
వర్షాలకు దెబ్బతింటున్న పంటలు
జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల వల్ల మొక్కజొన్న, సోయా, ఇతర పంటలకు నష్టం వాటిల్లుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వరి బాగా పెరుగుతండడం, ఇతర వ్యాధులు పంటకు వ్యాపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి ఎక్కువగా ఉండడం, వర్షాలు పడుతుండడం వల్ల వరి బాగా ఎదుగుతుండడంతో కీలకమైన పూత దశలో ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు భావిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదిస్తూ తమకు సహకారం అందించాలని కోరుతున్నారు. జిల్లాలో వర్షాల వల్ల కొంతమేర పంటలకు ఇబ్బందులు ఎదురవుతున్నా రైతులకు కావాల్సిన విధంగా సహకారం అందిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. శాస్త్రవేత్తల సూచనలు పాటించి పంటలను కాపాడుకోవాలని ఆయన కోరారు.