యాదగిరిక్షేత్రంలో శాస్త్రోక్తంగా నిత్యపూజలు
ABN , First Publish Date - 2022-08-19T06:00:51+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్యారాధనలు, మహాలక్ష్మీ అమ్మవారికి కోటికుంకుమార్చన పూజాకైంకర్యాలు వైభవంగా కొనసాగాయి.
యాదగిరిగుట్ట, ఆగస్టు18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్యారాధనలు, మహాలక్ష్మీ అమ్మవారికి కోటికుంకుమార్చన పూజాకైంకర్యాలు వైభవంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన పూజారులు గర్భాలయంలోని స్వయంభువులను, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు వేదమంత్రాలతో పంచామృతాభిషేకం చేసి, తులసీదళాలతో సహస్రనామార్చనలు చేశారు. ఆలయ అష్ఠభుజి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేసిన అర్చకులు విశ్వక్సేనుడికి తొలి పూజలతో హోమ పూజలు నిర్వహించారు. అనంతరం గజవాహన సేవోత్సవం చేసి, కల్యాణ వేడుకలు జరిపారు. అనుబంధ శివాలయంలో పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరుడికి, స్ఫటికమూర్తులకు నిత్యపూజలు, కొండకింద దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామివ్రతాలు స్మార్త సంప్రదాయరీతిలో నిర్వహించారు. ఆలయ అష్టభుజి, ఈశాన్య ప్రాకార మండపంలో మహాలక్ష్మీ అమవారికి ఆచార్యులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం రుత్వికులు, అర్చకబృందం అమ్మవారి సహస్రనామ పఠనాలతో కుంకుమార్చన పూజలు చేశారు. ఇదిలా ఉండగా స్వాతంత్య్ర వజ్రోత్సోవాల్లో భాగంగా ఫ్రీడం కప్ క్రికెట్ టోర్నమెంట్ను గురువారం దేవస్థానం నిర్వహించింది. ఈటోర్నమెంట్లో నాలుగు టీమ్లు పాల్గొనగా ఈఈ దయాకర్రెడ్డి సింహ టీమ్పై ఏఈవో గజవెల్లి రమేశ్బాబు జ్వాల టీమ్ విజేతగా నిలిచింది. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.17,99,954 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి దంపతుల పూజలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువులు, కవచమూర్తులను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత సువర్ణ పుష్పార్చన పూజల్లో పాల్గొన్నారు. పూజలనంతరం అర్చకులు ఆయనకు ఆశీర్వచనం జరపగా..దేవస్థాన అధికారులు స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదాలను అందజేశారు.