పార్టీ మాస్క్తో కోడ్ ఉల్లంఘించిన బీజేపీ మంత్రి
ABN , First Publish Date - 2020-10-28T17:07:37+05:30 IST
బీహార్ తొలి విడత పోలింగ్లో బీజేపీ నేత, వ్యవసాయ మంత్రి ప్రేమ్కుమార్ ఎన్నికల ప్రవర్తనా..
పాట్నా: బీహార్ తొలి విడత పోలింగ్లో బీజేపీ నేత, వ్యవసాయ శాఖ మంత్రి ప్రేమ్కుమార్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కనిపించింది. పార్టీ ఎన్నికల గుర్తును ప్రదర్శించే స్కార్ఫ్, మాస్క్ ధరించి ఆయన పోలింగ్ బూత్లోకి అడుగుపెట్టారు. గయ టౌన్ నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పోలింగ్ బూత్లోకి ఆయన బీజేపీ ఎన్నికల సింబల్తో కూడిన స్కార్ఫ్ వేసుకుని వచ్చారు. మాస్క్ సైతం పార్టీ గుర్తును చాటుతోంది. ఎన్నికల అధికారి కానీ, పోలీసు సిబ్బంది కానీ ఆయనను ఆపే ప్రయత్నం చేయలేదు. పైగా ఆయనను వెన్నంటే ఉండటం కూడా కనిపించింది. కాగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మంత్రిని అడిగినప్పుడు, తనకు అలాంటి ఉద్దేశమేదీ లేదని, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన సమాధానమిచ్చారు. మొత్తం 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై చురుకుగా సాగుతోంది. సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ముగుస్తుంది.