రెండేళ్లలో తాండూరు రూపురేఖలు మారుస్తా
ABN , First Publish Date - 2022-06-27T05:26:50+05:30 IST
రెండేళ్లలో తాండూరు రూపురేఖలు మారుస్తా
- 30 ఏళ్లుగా పాలించిన నాయకులు ఏం చేశారు?
- కల్లబొల్లి మాటలు చెప్పేవారిని నమ్మొద్దు
- ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
తాండూరు రూరల్, జూన్ 26 : మూడు దశబ్దాలుగా పరిపాలన చేసిన నాయకులు తాండూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని, మరో రెండేళ్లలో తాండూరును అన్నిరంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు మండలంలోని గౌతాపూర్లో సర్పంచ్ రాజప్పగౌడ్, ఎంపీటీసీ నరేందర్రెడ్డి(సాయిరెడ్డి) ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, రూ.18లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డుతోపాటు ఎమ్మెల్యే ఇప్పించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోహిత్రెడ్డి మాట్లాడుతూ తాను గెలుపొంది మూడున్నరేళ్లు అయ్యిందని, మొదటి సంవత్సరం ఎన్నికలకే పరిమితం కాగా, రెండు సంవత్సరాలపాటు కరోనా వణికించిందని, ప్రస్తుతం మిగిలిన రెండేళ్లలో తాండూరు నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించి రూపురేఖలు మారుస్తామన్నారు. మరికొన్ని నెలల్లో తాండూరుకు పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి పరుస్తామన్నారు. నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి సీఎం కేసీఆర్ రూ.3లక్షల స్కీంను స్థాపించనున్నారని, దీంతో పేదలకు న్యాయం చేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాటిస్తే తప్పని ప్రభుత్వమని, కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు పెట్టుబడి సాయం, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఉచిత విద్యుత్, దళిత బంధు వంటి పథకాలు అమలవుతున్నాయన్నారు. దీంతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. గౌతాపూర్ గ్రామంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించాలన్న కోరిక మేరకు.. సర్వేనెంబర్-35లో ప్రభుత్వ స్థలం వివాదంలో ఉన్నందున, రెవెన్యూ అధికారుల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్చైర్పర్సన్ దీపానర్సింహులు, సర్పంచ్ రాజప్పగౌడ్, ఎంపీటీసీ నరేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్, టీఆర్ఎస్ తాండూరు పట్టణ, మండల అధ్యక్షుడు నయీంఅఖ్తర్(అప్పు), గుర్రంపల్లి రాందాస్, మాజీ ఎంపీపీ శరణుబసవప్ప, మాజీ వైస్ఎంపీపీ శేఖర్, మహిళా నాయకురాలు శకుంతల, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాములు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ రాంలింగారెడ్డి, సర్పంచ్లు బుడ్డెళ్లి సాయిలు, గోవింద్, ద్యావరి నరేందర్రెడ్డి, నాయకులు ఉమాశంకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లప్ప, ఎంపీడీవో సుదర్శన్రెడ్డి, పీఆర్డీఈ వెంకట్రావు, షబ్బీర్ తదితరులున్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ రాజప్పగౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.