నకిలీ పాస్పోర్టుల వ్యవహారంలో.. పోస్టల్శాఖపై చర్యలు ఏవీ?
ABN , First Publish Date - 2021-02-28T04:13:35+05:30 IST
బోధన్లో నకిలీ పాస్పోర్టుల వ్యవహారం దేశవ్యాప్తం గా చర్చనీయాంశమైంది. రోహింగ్యాలకు బోధన్ కేంద్రంగా పాస్పోర్టులు జారీ కావడం కలకలం రేపింది.
ఆధార్కార్డులు, పాస్పోర్టులను ఇంటింటికీ వెళ్లి ఇవ్వని సిబ్బంది
పోస్టల్శాఖ నిర్లక్ష్యమే భారీ మూల్యానికి కారణం
బోధన్, ఫిబ్రవరి 27: బోధన్లో నకిలీ పాస్పోర్టుల వ్యవహారం దేశవ్యాప్తం గా చర్చనీయాంశమైంది. రోహింగ్యాలకు బోధన్ కేంద్రంగా పాస్పోర్టులు జారీ కావడం కలకలం రేపింది. అయితే ఈ వ్యవహారంలో ఎస్బీ పోలీసుల పాత్ర తేటతెల్లం కావడం అప్పటి ఎస్బీ అధికారులు మల్లేష్, అనిల్లను సస్పెండ్ చేసి రిమాండ్కు పంపారు. నకిలీ పాస్పోర్టుల వ్యవహారంలో ఎస్బీ అధికారుల డొల్లతనం వెలుగుచూడడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే నకిలీ పాస్పోర్టుల వ్యవహారంలో పోస్టల్శాఖ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తు న్నాయి. ఈ వ్యవహారంలో పోస్టల్శాఖలో ఎలాంటి చర్యలు కానరావడం లేదు. బోధన్ కేంద్రంగా ఏజెంట్లు, మీసేవ కేంద్రం నిర్వాహకులు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో తప్పుడు అడ్రస్లతో ఆధార్కార్డులు, పాస్పోర్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్బీ అధికారులు మొక్కుబడిగా ఎంక్వైయిరీ చేసి పాస్పోర్టులు జారీ అయ్యేలా సహకరించారు కానీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, అడ్రస్లు సమర్పించి ఆధార్కార్డులు, పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకోవడం అవి పోస్టల్ శాఖ ద్వారా తిరిగి రావడం జరిగింది. అయితే ఇక్కడే తిరకాసు నెలకొంది. లెక్కప్రకారం ఆధార్కార్డులు, పాస్పోర్టులు పోస్టల్శాఖ ద్వారా వస్తే వాటిని ఇంటింటికి వెళ్లి పోస్టల్ సిబ్బంది అందజేసి సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 70పైనే ఆధార్కార్డులు, పాస్పోర్టులు ఇలాగే వచ్చిన వాటిని ఇంటిం టికీ వెళ్లి ఇవ్వకుండా పోస్టల్శాఖ సిబ్బంది నేరుగా సదరు వ్యక్తులను ఫోన్ల ద్వారా సంప్రదించి వారికి నేరుగా అందజేశారు. ఇక్కడే ఘోర తప్పిదం జరిగిం ది. పోస్టల్శాఖ సిబ్బంది ఆధార్కార్డులు, పాస్పోర్టులను ఇంటింటికీ వెళ్లి ఇచ్చి ఉంటే తప్పుడు అడ్రస్లతో వచ్చిన వాటిని అసలు యజమానులు గుర్తించి అడ్డుకునేవారు. సదరు పేర్లకు సంబంధించిన వ్యక్తులు తమ ఇళ్లల్లో లేరని వారి పేర్ల పైన ఆధార్కార్డులు, పాస్పోర్టులు ఎలా వచ్చాయని ప్రశ్నించి నిలదీసే వారు. పోస్టల్శాఖ ఇంటింటికీ వెళ్లి ఉంటే నకిలీ పాస్పోర్టుల వ్యవహారం ప్రారంభంలోనే తేటతెల్లం అయ్యేది. ఒకరికో ఇద్దరికో నేరుగా ఇచ్చారంటే నమ్మ వచ్చు కానీ ఏకంగా 70 పైనే వ్యక్తులకు ఆధార్కార్డులను, పాస్పోర్టులను ఇం టికి వెళ్లి పరిశీలించి ఇవ్వకుండా నేరుగా వారిని రప్పించి వారి చేతుల్లోనే ఆధార్ కార్డులు, పాస్పోర్టులను పెట్టడం వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పటికే నకిలీ పాస్పోర్టుల వ్యవహారంలో ఇద్దరు ఎస్బీ సిబ్బందిపై వేటు పడి చర్యలు తీసుకోవడం జైలుకు పంపడం వరకు వెళ్లింది. ఇదే వ్యవహారంలో పోస్టల్శాఖ నిర్లక్ష్యం పై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70పైనే పాస్పోర్టులు, ఆధార్కార్డులను ఇళ్లకు వెళ్లకుండా వారిని పిలిపించి నేరుగా అందజేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో పోస్టల్శాఖపై ఇప్పటికీ ఎలాంటి చర్య లు తీసుకున్న దాఖలాలు లేవు. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా చర్యలు తీసుకోవడంలో పోస్టల్శాఖ ఉన్నత అధికారులు ఎందుకు వెనుకాడు తున్నారో స్పష్టం చేయాల్సి ఉంది.