రాత్రంతా అంబులెన్స్లో!
ABN , First Publish Date - 2021-04-17T09:13:15+05:30 IST
ఆమె పేరు అంకిపల్లి వెంకట్రావమ్మ! వయసు 45 సంవత్సరాలు. ఊరు... గుంటూరు జిల్లా మాచర్ల. ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డారు. 3రోజులపాటు గుంటూరు ప్రభుత్వ
కనిపించిన ప్రతి ఆస్పత్రికి వెళ్లినా...
ప్రాధేయపడినా ఒక్క బెడ్ లభించని దైన్యం
మరొకరు డిశ్చార్జి అయ్యాకే అడ్మిషన్
మాచర్ల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): ఆమె పేరు అంకిపల్లి వెంకట్రావమ్మ! వయసు 45 సంవత్సరాలు. ఊరు... గుంటూరు జిల్లా మాచర్ల. ఇటీవల ఆమె కరోనా బారిన పడ్డారు. 3రోజులపాటు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొంది... బుధవారం ఇంటికి చేరుకున్నారు. గురువారం సాయంత్రమే మళ్లీ సమస్య మొదలైంది. ఆయాసం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మాచర్లలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ‘ఇక్కడ కాదు. గుంటూరుకు తీసుకెళ్లండి’ అన్నారు. సాయంత్రం 7గంటలకు ప్రైవేటు ఆంబులెన్స్లో గుంటూరు బయలుదేరారు. అందులోనే ఆమెకు ఆక్సిజన్ అందిస్తూ వచ్చారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో చిలకలూరిపేట కాటూరు కొవిడ్ కేంద్రానికి తీసుకెళ్లారు. ‘బెడ్స్ ఖాళీ లేవు’ అని నిర్వాహకులు సూటిగా చెప్పేయడంతో నేరుగా గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు.
అప్పటికే 4గంటల సమయం గడిచిపోయింది. అక్కడా అదే సమాధానం! మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి వెళ్తే అక్కడ కూడా ‘బెడ్స్ ఖాళీ లేవు’... అంటూ చికిత్సకు తిరస్కారం! దీంతో కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. అంబులెన్స్లో తిరుగుతూనే ఉన్నారు. గుంటూరు నుంచి విజయవాడ వరకు ఉన్న అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లారు. అన్నిచోట్లా ఒకటే సమాధానం! జిల్లా స్థాయి అధికారుల సహాయం కోరినా బెడ్ దొరకలేదు.
రాత్రి 7 గంటలకు మొదలైన ప్రయాణం సాగుతూనే ఉంది. తిరిగి... తిరిగి... శుక్రవారం ఉదయం 8గంటలకు మళ్లీ జీజీహెచ్కే చేరుకున్నారు. ఆ సమయంలో మరో పేషెంట్ డిశ్చార్జ్ అవుతుండడంతో ఆ స్థానంలో వెంకట్రావమ్మను చేర్చుకున్నారు. అంటే మాచర్లలో బయలుదేరిన 25గంటలకు ఆమెకు చికిత్స మొదలైంది. ‘104’కు ఫోన్చేస్తే అన్నీ వాళ్లే చూసుకుంటారని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ... నేరుగా ఆస్పత్రులకే వెళ్లి ప్రాధేయపడినా బెడ్ దొరకని పరిస్థితి కనిపిస్తోంది.