ఆ గ్రామంలో అందరికీ సింగిల్ కిడ్నీలే.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

ABN , First Publish Date - 2022-03-17T20:58:56+05:30 IST

అఫ్గానిస్తాన్‌లోని హెరాత్ నగరానికి సమీపంలో ఉన్న ఒక గ్రామం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఆ గ్రామంలో అందరికీ సింగిల్ కిడ్నీలే.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

అఫ్గానిస్తాన్‌లోని హెరాత్ నగరానికి సమీపంలో ఉన్న ఒక గ్రామం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ గ్రామంలోని చాలా మంది ప్రజలు ఒక కిడ్నీతోనే మనుగడ సాగిస్తున్నారు. ఆ గ్రామం పేరు.. షెన్‌షైబా బజార్. అక్కడ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. కొన్ని వందల మంది సింగిల్ కిడ్నీలతోనే జీవిస్తున్నారు. అక్కడి వారు జన్యు లోపంతో అలా పుట్టారనుకుంటే పొరపాటే. మిగతా మనుషుల్లాగానే వారు కూడా రెండు కిడ్నీలతోనే జన్మించారు. అయితే ఆకలి బాధలు, పేదరికం తట్టుకోలేని చాలా మంది తమ శరీరంలోని ఒక కిడ్నీని అమ్మేసుకున్నారు. 


తాలిబాన్ పాలన మొదలైన తర్వాత ఆ గ్రామంలో పేదరికం విపరీతంగా పెరిగిపోయింది. అంతకు ముందు నుంచే తీవ్ర పేదరికంతో బాధపడుతున్న అక్కడి ప్రజలు కుటుంబాన్ని పోషించడానికి శరీర భాగాలను అమ్ముకోవడం ప్రారంభించారు. ఆ ఒక్క గ్రామంలోనే చాలా మంది కిడ్నీలు అమ్ముకున్నారు. ఆ గ్రామాన్ని `వన్ కిడ్నీ విలేజ్` అని పిలుస్తుంటారు. కిడ్నీలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకోవడం అక్కడి ప్రజలకు సర్వసాధారణంగా మారింది. అఫ్గానిస్తాన్‌లో అలాంటి అవయవ విక్రయ రాకెట్లపై నియంత్రణ లేదు. దాత లిఖితపూర్వకంగా అనుమతి ఇస్తే చాలు.. వైద్యులు కిడ్నీని తొలగించేస్తారు. 


ఒక కిడ్నీ ఖరీదు 2 లక్షల 50 వేల రూపాయల వరకు ఉంటుంది. కిడ్నీలను అమ్ముకున్న చాలా మంది వ్యక్తులు పనుల్లోకి వెళ్లలేక ఇళ్లలోనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. `నా పిల్లలను పోషించాలి. నాకు మరో ఆప్షన్ లేదు. నా పిల్లల కోసమే నేను కిడ్నీ అమ్ముకున్నాన`ని నూరుద్దీన్ అనే వ్యక్తి చెప్పాడు. నిరుద్యోగం, వసతుల లేమి, ఆహార సంక్షోభం తీవ్రమవడంతోనే ఆ గ్రామంలో ఈ పరిస్థితి తలెత్తింది. 

Updated Date - 2022-03-17T20:58:56+05:30 IST