sbi: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్న్యూస్.. ఇకపై ఆ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు..
ABN , First Publish Date - 2022-09-19T03:15:16+05:30 IST
ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని కస్టమర్లతో పంచుకునే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(SBI) ఈసారి ఒక గుడ్న్యూస్తో ఖాతాదారుల ముందుకొచ్చింది.
ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని కస్టమర్లతో పంచుకునే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ(SBI) ఈసారి ఒక గుడ్న్యూస్తో ఖాతాదారుల ముందుకొచ్చింది. మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్స్(MFT)పై ఎస్ఎంఎస్ ఛార్జీలను రద్దు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే యూఎస్ఎస్డీ(USSD ) సర్వీసులను పొందొచ్చని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ వేదికగా ఆదివారం ప్రకటించింది. ఈ నిర్ణయం ఫీచర్ ఫోన్లు వాడుతున్నవారికి ఉపశమనం కలిగించనుంది.
‘‘మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్స్పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీ చేస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. అదనపు ఛార్జీలు లేకుండానే యూఎస్ఎస్డీ సర్వీసులు ఉపయోగించుకోవవచ్చు’’ అని ఎస్బీఐ ప్రకటించింది. కాగా ఉచిత మొబైల్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ నిర్ణయం ప్రత్యేకంగా ఫీచర్ ఫోన్లు ఉపయోగించే ఎస్బీఐ ఖాతాదారులు ప్రయోజనం పొందనున్నారు.
ఖాతాదారులు చేయాల్సింది ఇదే..
ఎస్బీఐ ఖాతాదారులు తమ ఫీచర్ ఫోన్పై *99# డయల్ చేసి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపించొచ్చు లేదా మనీ రిక్వెస్ట్ చేయవచ్చు. అంతేకాకుండా అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ను చెక్ చేసుకోవడంతోపాటు యూపీఐ పిన్ కూడా వెసులుబాటు ఉంటుంది.