పెట్రో ధరల తగ్గింపుపై భారత్కు ఇమ్రాన్ ప్రశంస
ABN , First Publish Date - 2022-05-23T08:08:31+05:30 IST
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించినందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
ఇస్లామాబాద్, మే 22: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించినందుకు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా విదేశాంగ విధానంలో స్వతంత్రను ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. అదే పాకిస్థాన్ ప్రభుత్వం తలతెగిన కోడిలా ఇష్టం వచ్చినట్టు వ్యహరిస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘క్వాడ్లో సభ్యదేశమైనప్పటికీ భారత్ అమెరికా ఒత్తిళ్లను తట్టుకొంది. డిస్కౌంట్పై రష్యా అందజేస్తున్న ఆయిల్ కొనుగోలు చేసి తన ప్రజలకు ఊరట కలిగిస్తోంది. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించి మా ప్రభుత్వం కూడా ఇలాగే చేయాలనుకుంది. మా ప్రభుత్వానికి పాకిస్థాన్ ప్రయోజనాలే పరమావధి. కానీ స్థానిక మీర్ జాఫర్లు, మీర్ సాధిక్లు విదేశీ ఒత్తిళ్లకు లొంగి ప్రభుత్వాన్ని మార్చారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కూలిపోయే స్థితిలో ఉంటే వారు తలలేని కోడిలా పరుగులు తీస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయన్న సమాచారాన్ని రీట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్య చేశారు.