విద్యార్థినుల ఆరోగ్యం మెరుగు

ABN , First Publish Date - 2021-12-01T04:44:49+05:30 IST

అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు.

విద్యార్థినుల ఆరోగ్యం మెరుగు
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో విద్యార్థినికి చికిత్స అందిస్తున్న వైద్యసిబ్బంది

కొవిడ్‌ సోకిన ముగ్గురికి ఐసీయూలో చికిత్స

 జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి


సంగారెడ్డిఅర్బన్‌, నవంబరు30: అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం మెరుగుపడుతుందని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంగారెడ్డి తెలిపారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి బీసీ గురుకుల పాఠశాలలో 47 మం ది విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురి విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో సోమవారం రాత్రి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఐసీయూలో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత వారికి మరోసారి ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేశారు. ముగ్గురి ఆరోగ్యం బాగుందని సూపరింటెండెంట్‌ సంగారెడ్డి తెలిపారు. 


 అప్రమత్తంగా ఉన్నాం

 చాలా రోజుల తర్వాత విద్యార్థుల్లో ఎక్కువ పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవి తెలిపారు. ప్రస్తుతానికి పాజిటివ్‌ వచ్చిన విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలికి ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా ముత్తంగి గురుకుల పాఠశాలలోనే వైద్యబృందాన్ని ఏర్పాటు చేశామని ఆమె వివరించారు.  విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు. ప్రస్తుతానికి జిల్లాలో కొవిడ్‌ కేసులు పెద్దగా లేకున్నా..ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి వేగంగా ఉందన్న అనుమానాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆమె సూచించారు. 

Updated Date - 2021-12-01T04:44:49+05:30 IST