కృష్ణా జిల్లా నేతలకు కీలక పదవులు
ABN , First Publish Date - 2020-10-20T14:48:12+05:30 IST
తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో జిల్లా నేతలకు అగ్రతాంబూలమే దక్కింది. పార్టీలో ఆయా నాయకులు అందిస్తున్న..
టీడీపీ పొలిట్బ్యూరోలోకి బొండా ఉమా, కొల్లు రవీంద్ర
పొలిటికల్ సెక్రటరీగా టీడీ జనార్దనరావు
బచ్చులకు క్రమశిక్షణ కమిటీ బాధ్యతలు
కోశాధికారిగా శ్రీరాం తాతయ్య
కేంద్ర జనరల్ సెక్రటరీగా వర్ల రామయ్య
అశోక్బాబు, పట్టాభిలకూ పదవులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరోలో జిల్లా నేతలకు అగ్రతాంబూలమే దక్కింది. పార్టీలో ఆయా నాయకులు అందిస్తున్న సేవలను గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు వారి పనితీరు ఆధారంగా, ఆయా సామాజికవర్గాలవారీగా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. టీడీపీలో ప్రస్తుతం జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలను పొలిట్బ్యూరోలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించారు. ప్రస్తుతం పొలిట్బ్యూరో సభ్యునిగా ఉన్న వర్ల రామయ్యకు అదనంగా పార్టీ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ బాధ్యతలు కట్టబెట్టారు.
మొన్నటి వరకు కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని ఇటీవలే గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన పార్టీ అధిష్ఠానం, తాజాగా ఆయనను పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా నియమించింది. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి శ్రీరాం రాజగోపాల్ తాతయ్యను కేంద్ర కమిటీ కోశాధికారిగా, అదే నియోజకవర్గానికి చెందిన టీడీ జనార్దనరావును పొలిటికల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)గా నియమించారు. ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబును పార్టీ సెంట్రల్ ఆఫీసు సెక్రటరీగా నియమించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్కు పదోన్నతి కల్పిస్తూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా నియమించారు.