దేశ వ్యాప్తంగా దళితబంధును అమలు చేయించండి
ABN , First Publish Date - 2022-01-24T09:04:14+05:30 IST
బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు.
బీజేపీ ఎంపీలకు మంత్రి హరీశ్రావు సవాల్
సంగారెడ్డి టౌన్, జనవరి 23: బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. దళితబంధు అమలుపై సంగారెడ్డి కలెక్టరేట్లో ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితబంధును అమలుచేసి తీరతామని స్పష్టం చేశారు. దళితబంధు, మన ఊరు మన బడి అమలును జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. దళితబంధును దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని బీజేపీని డిమాండ్ చేశారు. బండి సంజయ్కి దమ్ముంటే కేంద్రం నుంచి నవోదయ విద్యాలయాలను, గిరిజన వర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీలను తీసుకు రావాలన్నారు. పోటీ పరీక్షలు కేవలం హిందీలో కాకుండా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఆదివారం చేపట్టిన జ్వరసర్వేలో మంత్రి పాల్గొని పరిశీలించారు. మరో ఐదు రోజుల్లో జ్వరసర్వేను పూర్తి చేస్తామన్నారు.