పశ్చిమాన వలసలు
ABN , First Publish Date - 2021-10-19T05:43:39+05:30 IST
గజ్జహల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు మిరప పంట తెంచేందుకు గుంటూరు, సంగారెడ్డి జిల్లాలకు వలస వెళ్లాయి.
- కోసిగి నుంచి తెలంగాణకు 50 కుటుంబాలు
కోసిగి, అక్టోబరు 18: ఈ ఏడాది వర్షాలు సక్రమంగా రాకపోవడంతో పూర్తిస్థాయిలో దిగుబడులు చేతికందలేదు. ఊళ్లో పనులు అంతంత మాత్రమే. దీంతో చేసేదేమీ లేక మూటాముల్లె సర్దుకుని దాదాపు 50 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాకు వలస వెళ్లాయి. కోసిగిలోని 9వ వార్డు వడ్డెనగర్ కాలనీకి చెందిన వీరంతా పత్తి పనులకు సోమవారం రాత్రి వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఉపాధి హామీ పనులు కూడా కల్పించకపోవడంతో భార్య, పిల్లలతో కలిసి వలస వెళ్లడం తప్పలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే ఉంటే పస్తులు ఉండాల్సి వస్తుందన్నారు. వీరి వెంట 80 ఏళ్ల ఓ వృద్ధుడు కూడా వెళ్లారు.
గజ్జహల్లి నుంచి 30 కుటుంబాలు
హొళగుంద, అక్టోబరు 18: గజ్జహల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు మిరప పంట తెంచేందుకు గుంటూరు, సంగారెడ్డి జిల్లాలకు వలస వెళ్లాయి. ఉపాధి పనులకు వెళ్లినా సక్రమంగా వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండుగ పూర్తి కావడంతో మండలంలో మరిన్ని గ్రామాల నుంచి కూలీలు వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.