Red alert : ముంబై, కర్ణాటకలకు భారీ వర్ష సూచన

ABN , First Publish Date - 2022-07-09T16:44:21+05:30 IST

నైరుతి రుతుపవనాల (southwest monsoon) రాకతో దేశంలోని చాలా

Red alert : ముంబై, కర్ణాటకలకు భారీ వర్ష సూచన

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాల (southwest monsoon) రాకతో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలలో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలకు రెడ్ అలర్ట్ (Red alert) ప్రకటించింది. గుజరాత్, ఢిల్లీలలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 


మహారాష్ట్రలోని ముంబైలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం హెచ్చరించింది. జూలై 11 సోమవారం వరకు కొంకణ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొంకణ్ (Konkan) ప్రాంతంలోని అన్ని జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 


కర్ణాటకలోని  కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ, రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది ఉడుపి జిల్లాలోని చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నట్లు తెలిపింది. కలబురగిలో పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. వర్షాల ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న 13 జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, డిప్యూటీ కమిషనర్లతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) శుక్రవారం ఓ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించారు. 


కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో యెల్లో అలర్ట్‌ను  ఐఎండీ  జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో కేరళ, తెలంగాణా, కర్ణాటకలలో చెదురుమదురుగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. 


గోవాలో 1 నుంచి 8 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులకు సెలవు ప్రకటించారు. ఈ రాష్ట్రంలో కూడా ఐఎండీ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. 


హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, మండీ, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. సిమ్లా, బిలాస్‌పూర్, హమీర్‌పూర్, ఉణ జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 


తెలంగాణా (Telangana)లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాల్లో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. 


Updated Date - 2022-07-09T16:44:21+05:30 IST