కోవిడ్-19తో యువత ఉపాధి గల్లంతు : ఐఎల్ఓ
ABN , First Publish Date - 2020-05-28T09:03:41+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచ వ్యాప్తంగా యువత ఉపాధినీ దెబ్బతీస్తోంది.
న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచ వ్యాప్తంగా యువత ఉపాధినీ దెబ్బతీస్తోంది. ఈ మహమ్మారితో ప్రస్తుతం 15-25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆరుగురు యువతలో ఒకరికిపైగా ఉపాధి కోల్పోయారు. పని చేస్తున్న వారి పనిగంటలూ 23 శాతం తగ్గిపోయాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఒక నివేదికలో ఈ విషయం తెలిపింది. ఇలా ఉపాధి కోల్పోయిన వారిలో యువకుల కంటే యువతులే ఎక్కువ. కోవిడ్-19తో తలెత్తిన ఆర్థిక, సామాజిక పరిణామాలతో ఎక్కువగా నష్టపోతోంది కూడా 15-25 సంవత్సరాల మద్య ఉన్న యువతరమేనని ఐఎల్ఓ పేర్కొంది. వీరిలో దాదాపు 77 శాతం మంది అసంఘటిత రంగంలో పని చేయడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. చదువుకుంటున్న వారిలోనూ సగం మంది తమ చదువులు సకాలంలో పూర్తయ్యే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. పది శాతం మందైతే చదువులపై ఆశలు వదులుకుంటున్నట్టు ఐఎల్ఓ సర్వేలో తేలింది.