టీకా తీసుకున్న మరో ఇద్దరికి అస్వస్థత
ABN , First Publish Date - 2021-03-04T08:59:20+05:30 IST
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పారిశుధ్య కార్మికుడు మరణించి 24గంటలు గడవకముందే మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు.
ఆస్పత్రిలో చేరిన మహిళా పారిశుధ్య కార్మికులు
తెనాలి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పారిశుధ్య కార్మికుడు మరణించి 24గంటలు గడవకముందే మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. 7, 8 డివిజన్లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు నల్లగొర్ల రమణమ్మ, కాబోటి వెంకటలక్ష్మి మంగళవారం నుంచి వాంతులు, విరోచనాలతో నీరసించారు. వారిని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఆరు రోజుల క్రితమే వ్యాక్సిన్ తీసుకున్నామని, రెండు రోజులు సెలవు అనంతరం విధులకు హాజరయ్యామని వారు పేర్కొన్నారు. అప్పటినుంచి నీరసంగానే ఉంటోందని చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వీరిని గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపే ఆలోచనలో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం, చిన్నపాటి సమస్యలు రావడం సహజమని, అయితే ప్రాణాంతక పరిస్థితి ఉండదని వైద్యశాల సూపరింటెండెంట్ సనత్కుమారి చెప్పారు. కార్మికులు అస్వస్థతకు గురికావడంపై ఆరా తీస్తున్నామని మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు అన్నారు. కాగా, 13రోజుల క్రితం వ్యాక్సిన్ తీసుకుని మంగళవారం మృతిచెందిన ఔట్సోర్సింగ్ కార్మికుడు దుర్గారావు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ తోటి కార్మికులు బుధవారం ఆస్పత్రి వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు.