గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలి
ABN , First Publish Date - 2022-09-27T05:42:43+05:30 IST
ఒంగోలు మండలం యరజర్ల వద్ద వైసీపీ నేతలు గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని టీడీపీ నాయకులు సోమవారం స్పందనలో డీఆర్వో చిన్నఓబులేసుకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అండదండలతో ఈ వ్యవహారం జరుగుతున్నదని వారు ఆరోపించారు.
డీఆర్వోను కోరిన టీడీపీ నాయకులు, గ్రామస్థులు
ఒంగోలు (కలెక్టరేట్), సెప్టెంబరు 26 : ఒంగోలు మండలం యరజర్ల వద్ద వైసీపీ నేతలు గ్రావెల్ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారని టీడీపీ నాయకులు సోమవారం స్పందనలో డీఆర్వో చిన్నఓబులేసుకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అండదండలతో ఈ వ్యవహారం జరుగుతున్నదని వారు ఆరోపించారు. వైసీపీ నాయకులు కొండలను గుల్లచేస్తూ మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే తవ్వకాలను అడ్డుకోవాలని వారు కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో టీడీపీ నగర అధ్యక్షుడు కఠారి నాగేవ్వరరావు, యరజర్ల ఎంపీటీసీ సభ్యుడు గుండపనేని శ్రీనివాసరావు, నాయకులు పసుమర్తి హగ్గయ్యరాజ్, గోగినేని రామారావు, 26వ డివిజన్ కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజ, ఆర్లబుజ్జి, మాదాసు చంద్ర, కోటపూరి చిరంజీవి తదితరులు ఉన్నారు. మరోవైపు యరజర్ల కొండ వద్ద గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్థులు కూడా అధికారులకు ఫిర్యాదు చేశారు. 22వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చేందుకు అక్కడ రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం భూమిని చదును చేయించిందన్నారు. ఆ ప్లాట్లను కూడా ధ్వసం చేసి లారీలు, ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని వారు కోరారు.