విఠ్యాలలో అక్రమంగా మట్టి తవ్వకాలు

ABN , First Publish Date - 2022-06-26T05:59:40+05:30 IST

విఠ్యాలలో అక్రమంగా మట్టి తవ్వకాలు

విఠ్యాలలో అక్రమంగా మట్టి తవ్వకాలు
ఇటాచ్‌తో మట్టి తవ్వకాలు

  • తహసీల్దార్‌కు గ్రామస్థుల ఫిర్యాదు 


షాద్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 25: మైనింగ్‌ మాటున రెండు నెలలుగా సాగిస్తున్న అక్రమ మట్టి వ్యాపారాన్ని గ్రామస్థులు బట్ట బయలు చేశారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాలతో పోలీసులు మట్టి తరలిస్తున్న టిప్పర్లను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. విఠ్యాల గ్రామ శివారులో ఉన్న గుట్టల్లో ప్రభుత్వ అనుమతితో కొందరు మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. దాన్ని అదనుగా తీసుకున్న కొందరు మైనింగ్‌ సమీపంలో ఉన్న సర్వే నెంబర్‌ 212లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. తీసినమట్టిని చౌలపల్లి శివారులో కొత్తగా ఏర్పాటు చేసిన రియల్‌ వెంచర్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తీసినగోతిని చూస్తే సుమారు 650నుంచి 700ట్రిప్పుల మట్టిని తరలించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్‌ టిప్పర్ల వెంబడే మట్టి టిప్పర్లు వెళ్లడం వల్ల అటువైపు చూడని గ్రామస్థులు శనివారం అనుమానం వచ్చి టిప్పర్లను గమనించగా మట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే టిప్పర్లను ఆపి తహసీల్దార్‌కు పిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని మట్టి లోడుతో ఉన్న టిప్పర్లను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఫిర్యాదు చేసిన వారిలో మాజీ సర్పంచ్‌ అంజయ్య, నెహ్రూనాయక్‌, వెంకటేష్‌, జగన్‌, నర్సింలు ఉన్నారు. ఈవిషయమై ఫరూఖ్‌నగర్‌ తహసీల్దార్‌ గోపాల్‌ను వివరణ కోరగా విచారణ చేయిస్తామన్నారు.

Updated Date - 2022-06-26T05:59:40+05:30 IST