ఆక్రమణల తొలగింపు
ABN , First Publish Date - 2022-05-22T05:43:30+05:30 IST
భీమవరం–పాలకొల్లు జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాల్లో ఆక్రమణలు తొలగింపులో భాగంగా శృంగవృక్షంలో రెండు రోజులుగా ఆక్రమణలు తొలగిస్తున్నారు.
పాలకోడేరు, మే 21 : భీమవరం–పాలకొల్లు జాతీయ రహదారి వెంబడి ఉన్న గ్రామాల్లో ఆక్రమణలు తొలగింపులో భాగంగా శృంగవృక్షంలో రెండు రోజులుగా ఆక్రమణలు తొలగిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి దొంగ సత్యనారాయణ, సచివాలయం సిబ్బంది సహకారంతో రహదారి వెంబడి ఉన్న ఆక్రమణలను తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ట్రాక్టర్ల సాయంతో అడ్డుగా ఉన్న వస్తువులను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. రహదారుల వెంబడి ఇకపై ఆక్రమణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మార్కింగ్ లేకుండా తొలగింపు.. అడ్డుకున్న యజమానులు
వీరవాసరం, మే 21 : హైవేకు చేర్చి ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ప్రారంభం అయ్యాయి. శుక్ర, శనివారాలు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య దుకాణాల ముందు వేసిన పందిర్లు, షెడ్లను రహదారి మార్జిన్లో వేసిన దుకాణాలను తొలగించారు. మరికొన్ని చోట్ల స్వచ్ఛందంగా తొలగించని ఆక్రమణలను శనివారం తొలగించేందుకు పంచాయతీ అధికారులు ఎక్స్కవేటర్తో చర్యలు ప్రారంభించారు. వీరవాసరం పంట కాల్వ నుంచి తొలగింపునకు సిద్ధపడ్డారు. మార్కింగ్ వేయకుండా డ్రెయిన్కు చేర్చి రహదారులు భవనాల శాఖ స్థలం ఉన్నంత వరకు, మూడు అడుగులు దూరం తొలగిస్తున్నామంటూ అధికారులు తెలిపారు. దీనిని ఆ ప్రాంత గృహ యజమానులు వ్యతిరేకించి అడ్డుకోవడంతో తాత్కాలికంగా పనులు నిలిపి వేశారు.