మోదీకి IIM విద్యార్థులు, ఫ్యాకల్టీ లేఖ

ABN , First Publish Date - 2022-01-08T18:07:50+05:30 IST

మీ మౌనం విద్వేష గళాలకు మరింత ధైర్యాన్నిస్తోంది’

మోదీకి IIM విద్యార్థులు, ఫ్యాకల్టీ లేఖ

న్యూఢిల్లీ : ‘‘మీ మౌనం విద్వేష గళాలకు మరింత ధైర్యాన్నిస్తోంది’’ అంటూ బెంగళూరు, అహ్మదాబాద్‌లలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం ఓ లేఖ రాశారు. దీనిపై 183 మంది సంతకాలు చేశారు. 


మన దేశ బహుళ సంస్కృతుల కలనేతకు తాము విలువనిస్తామని, అటువంటి తమకు ‘‘మన దేశంలో పెరుగుతున్నఅసహనంపై మీ మౌనం, గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ, మాకు నిరుత్సాహం కలిగిస్తోంది. మీ మౌనం, గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ, విద్వేషం నిండిన గళాలకు మరింత ధైర్యాన్నిస్తోంది, మన దేశ ఐకమత్యం, సమగ్రతలకు ముప్పు కలిగిస్తోంది’’ అని ఈ లేఖలో పేర్కొన్నారు. మనల్ని విభజించాలని కోరుకుంటున్న శక్తుల నుంచి దేశాన్ని దూరంగా నడపాలని కోరారు. 


ఈ లేఖను ఐఐఎం బెంగళూరు ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రతీక్ రాజ్, దీపక్ మల్ఘన్, దల్హియా మణి, రాజ్ లక్ష్మి వీ మూర్తి, హేమ స్వామినాథన్ రాశారు. రాజ్ మాట్లాడుతూ, మౌనంగా ఉండటం ఇక ఎంత మాత్రం సరైనది కాదని కొందరు విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్స్ నిర్ణయించుకుని, ఈ లేఖ రాసినట్లు చెప్పారు. చాలా కాలంపాటు ఇటువంటి అసహనంతో కూడిన గళాలను చిల్లర గ్రూపుల మాటలుగా వదిలిపెట్టామన్నారు. 


ఈ లేఖపై సంతకం చేసిన ఐఐఎం బెంగళూరు ఫ్యాకల్టీ మెంబర్స్ : ఈశ్వర్ మూర్తి, కంచన్ ముఖర్జీ, అర్పిత్ ఎస్, రాహుల్ డే, సాయి యయవరం, రాజ లక్ష్మి కామత్, రిత్విక్ బెనర్జీ, మనస్విని భల్లా.


ఈ లేఖపై సంతకం చేసిన ఐఐఎం అహ్మదాబాద్ ఫ్యాకల్టీ మెంబర్స్ : అంకుర్ సరీన్, నవదీప్ మాథుర్, రాకేశ్ బసంత్


Updated Date - 2022-01-08T18:07:50+05:30 IST