త్వరలో ట్రిపుల్‌ ఐటీల్లో పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2021-01-19T05:44:17+05:30 IST

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలో ట్రిపుల్‌ ఐటీల్లో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుందని ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి తెలిపారు. సోమవారం శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను ఆయన సందర్శించారు.

త్వరలో ట్రిపుల్‌ ఐటీల్లో పోస్టుల భర్తీ
క్యాంపస్‌ను పరిశీలిస్తున్న ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి

- ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి 

ఎచ్చెర్ల, జనవరి 18: రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) పరిధిలో ట్రిపుల్‌ ఐటీల్లో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుందని ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి తెలిపారు. సోమవారం శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి 235 బోధన, 185 బోధనేతర పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ‘2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆర్జీయూ కేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీల నిర్వహణకు రూ.935 కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని ప్రతిపాదించాం. ఇందులో రూ.450 కోట్లు సివిల్‌ పనులకు, రూ.160 కోట్లు సిబ్బంది జీతభత్యాలకు, రూ.235 కోట్లు నిర్వహణ ఖర్చులకు వినియోగించనున్నాం.  2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేశాం. స్పెషల్‌ కేటగిరీకి సంబంధించి ఇంకా అడ్మిషన్లు పూర్తికావలసి ఉంది.  విద్యార్థుల మెరిట్‌ ఆధారంగా క్యాంపస్‌ ఎంపికకు అవకాశం ఇచ్చాం. ట్రిపుల్‌ ఐటీలో చేరిన పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ముందుగా 3 వారాల పాటు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహిస్తాం. ఇంగ్లిష్‌, హాస్టల్‌ వసతులు, డిజిటల్‌ లిటరసీపై అవగాహన కల్పిస్తాం.  గణితం, ఇంగ్లిష్‌లో  విద్యార్థుల స్థాయిని అంచనావేసి అవసరమైన వారికి రెమిడియల్‌ తరగతులు నిర్వహిస్తాం. శ్రీకాకుళం క్యాంపస్‌లోనే పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తాం. ఇంజనీరింగ్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ఇక్కడే తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం రూ.66.7 కోట్లతో ఇక్కడి క్యాంపస్‌లో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2020-21 విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరు, అక్టోబరు నాటికి పూర్తిచేస్తాం’ అని ఛాన్సలర్‌ కేసీ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆర్జీయూకేటీ అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ హరినారాయణ, సెట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గోపాలరాజు, ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌ సామ్రాజ్యలక్ష్మి, ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ సుధాకర్‌, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.జగదీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 


 సందడిగా క్యాంపస్‌లు


విద్యార్థుల రాకతో శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు సోమవారం సందడిగా మారాయి.  ఎస్‌ఎంపురం కొండపై ఉన్న బాలికల క్యాంపస్‌కు సంబంధించి 468 మందికి 442 మంది, శివానీ కళాశాలలోని బాలుర క్యాంపస్‌కు సంబంధించి 560కి 516 మంది తరగతులకు హాజరయ్యారు.



Updated Date - 2021-01-19T05:44:17+05:30 IST