‘క్వారంటైన్’కు చేయలేం బాబోయ్!: ట్రిపుల్ ఐటీ సిబ్బంది
ABN , First Publish Date - 2020-03-29T08:51:50+05:30 IST
క్వారంటైన్ సేవలందించేందుకు సిబ్బంది రాకపోవడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం తెలంగాణ...
నూజివీడు టౌన్, మార్చి 28: క్వారంటైన్ సేవలందించేందుకు సిబ్బంది రాకపోవడంతో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం తెలంగాణ నుంచి వచ్చిన 44 మంది విద్యార్థుల కోసం నూజివీడు ట్రిపుల్ ఐటీలో పోలీస్ ఉన్నతాధికారులు క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే కరోనా సోకిన వారిని ముట్టుకున్నా, వారు తాకిన వస్తువులను పట్టుకున్నా వైరస్ వ్యాపిస్తుందన్న విస్తృత ప్రచారంతో ట్రిపుల్ ఐటీలో హౌస్ కీపింగ్, ప్లంబింగ్ తదితర సేవలందించే ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు పూర్తిగా డుమ్మా కొట్టడంతో అధికారులు ఏం చేయాలో పాలుపోక మల్లగుల్లాలు పడుతున్నారు.
కరోనా నేపథ్యంలో సెలవులు ప్రకటించడంతో ఇక్కడ చదువుకునే సుమారు తొమ్మిది వేల మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అధ్యాపక సిబ్బంది మాత్రమే క్యాంప్సలోని క్వార్టర్స్లో ఉంటున్నారు. సమస్యను ఇప్పటికే రెవెన్యూ, పోలీసు, ఆర్జీయూకేటీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, పరిస్థితి ఇలానే ఉంటే మరో 24 గంటల్లో ఇక్కడ ఉన్న వారికి సేవలందించడం కష్టమని వాపోతున్నారు. ఇప్పటికైనా నూజివీడు సబ్కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ట్రిపుల్ ఐటీ అధికారులు కోరుతున్నారు.