బదిలీ కావాలా.. అయితే నేతలను కలవండి!

ABN , First Publish Date - 2022-06-14T07:21:37+05:30 IST

ప్రభుత్వోద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఐదేళ్లు నిండిన ఉద్యోగులంతా వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే వారికి ఇక్కడే కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీపై వెళ్లేప్రాంతానికి సంబంధించి అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుల లేఖలు ఉంటేనే పోస్టింగ్‌లు ఇస్తున్నారు.

బదిలీ కావాలా.. అయితే నేతలను కలవండి!

సిఫార్సుల కోసం ఉద్యోగుల తిప్పలు


డక్కిలి, జూన్‌ 13: ప్రభుత్వోద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఐదేళ్లు నిండిన ఉద్యోగులంతా వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే వారికి ఇక్కడే కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. బదిలీపై వెళ్లేప్రాంతానికి సంబంధించి అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుల లేఖలు ఉంటేనే పోస్టింగ్‌లు ఇస్తున్నారు. లేదంటే బదిలీలకు దరఖాస్తు చేసుకున్నా పోస్టింగ్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెడుతున్నారన్న వార్తలు ఉద్యోగస్తులను కలవర పెడుతున్నాయి. డక్కిలి మండల పరిషత్‌ కార్యాలయంలో ఐదేళ్లు నిండిన పలువురు ఉద్యోగస్తులు ఉన్నారు. వీరంతా వేరే ప్రాంతానికి బదిలీ అయ్యేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే వీరు వెళ్లే మండలాలకు సంబంధించిన ఎమ్మెల్యే లేఖతోపాటు అక్కడి ఎంపీపీకి నచ్చితేనే అక్కడ కొలువులు దక్కుతాయి. లేదంటే మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కూడా సిపార్సు లేఖలు లేకపోతే గాలిలో ఉండాల్సిందే. ఈ విచిత్ర పరిస్థితి తామెప్పుడూ చూడలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు గ్రామ స్థాయిలో వైసీపీ చోటా నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దీన్ని అదనుగా భావించిన కొందరు అధికార పార్టీ నాయకులు చేతివాటానికి దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో కౌన్సెలింగ్‌ ద్వారా సాధారణ బదిలీలు చేపట్టేవారు. ఇపుడిలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు వుంటేనే పోస్టింగులు ఇవ్వడం ఏమిటని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. పైగా తామెళ్లే మండలానికి చెందిన నేతలతో పరిచయాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2022-06-14T07:21:37+05:30 IST