ఇష్టమైతేనే...
ABN , First Publish Date - 2022-08-08T04:44:27+05:30 IST
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై నిర్బంధమేమీ లేదు.
- ఓటర్ కార్డుకు ఆధార్ లింకుపై నిర్బంధమేమీ లేదు
- ఆగస్టు 15 తర్వాత ఇంటింటి సర్వే
- మార్పులు చేర్పులు చేయనున్న అధికారులు
- రెండు చోట్ల ఓటు ఉంటే ఒక చోట తొలగింపు
- ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1500 మంది ఓటర్లు
- మూడు నెలలకోసారి ఓటరుగా చేరేందుకు అవకాశం
ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానంపై నిర్బంధమేమీ లేదు. ఇష్టమైతేనే లింకు చేసుకోవచ్చు. లేదంటే బీఎల్వో అధికారులు ఆధార్ నెంబర్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఓటరు కార్డుకు అనుసంధానం చేసే కార్యక్రమం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా బూత లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టనున్నారు. అలాగే మూడు నెలలకోసారి ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1500 మంది ఓటర్ల కంటే ఎక్కువ మంది ఉంటే మరో కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
కర్నూలు(కలెక్టరేట్), ఆగస్టు 7: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో ఓటరు జాబితా నూతనీకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల జాబితాల్లో పేర్లున్న వారి ఆధార్ నెంబర్లను సేకరించి ఓటరు కార్డుకు అనుసంధానం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఆధార్ నెంబరు అనుసంధానం చేసే ప్రక్రియ ఆగస్టు 15 తర్వాత నుంచి ప్రారంభం కానుంది. అయితే ఆధార్ నెంబరు అనుసంధానం ఓటరు ఇష్టానుసారమే చేస్తారు. ఇందుకు నిర్బంధమేమీ ఉండదు.
ఇంటింటికీ వెళ్లి సర్వే:
పాత పద్ధతిలోనే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై బూత లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారు. ఈ సర్వేలో భాగంగా ఓటరు తన ఆధార్కార్డు నెంబరు తెలియజేయాలా వద్దా అనే అంశంపై నిర్బంధమేమీ లేదు. ఆధార్కార్డు నంబరును బలవంతంగా సేకరించవద్దని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వెసులుబాటును కల్పించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారు. ఓటర్లకు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్లను గోప్యంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో ఈ నియమం పాటించాలని జిల్లా స్థాయి అధికారులు బీఎల్వోలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
మార్పులు, చేర్పులకు మారిన దరఖాస్తులు:
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం ఇచ్చే దరఖాస్తులను ప్రస్తుతం మార్పు చేశారు. ఓటరుగా చేరేందుకు ఫారం-6తోపాటు, ఫారం-6 బీని కూడా పూర్తి చేసి జత చేసి ఇవ్వాలి. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులకు ఫారం-8ను ఇస్తే సరిపోతుంది. గతంలో మార్పులు, సవరణ కోసం ఫారం-8బీని ఇవ్వాల్సి వచ్చేది. ఓటర్ల జాబితాలో నుంచి పేరును తొలగించేందుకు ఫారం-7ను ఇస్తే సరిపోతుంది.
మూడు నెలలకోసారి అవకాశం
గతంలో ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా చేర్చేందుకు అవకాశం ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ విధానంలో మార్పులు చేశారు. జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబరు నెలల్లో 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండినవారిని ఓటర్లుగా చేర్చేందుకు అవకాశం కల్పించారు. కళాశాలల వద్ద యువత ఓటరుగా చేరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనవీఎస్పీ, ఓటరు పోర్టల్, వీహెచఏ యాప్ల ద్వారా ఓటరుగా చేరేందుకు అవకాశం కల్పించారు.
నిబంధనలు ఇవీ:
ఇక నుంచి ప్రతి పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు మించకూడదని నిర్ణయించారు. ఏదైనా ప్రాంతంలో 1500 మంది ఓటర్ల కన్నా మించి ఉంటే మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. గతంలో ఒక ఇంటిలో భార్యాభర్తలు ఉంటే భార్య ఒక పోలింగ్ కేంద్రంలో, భర్త మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి వచ్చేది. ఇక నుంచి ఒక కుటుంబంలోని వారు, ఒక వీధిలోని వారు ఒకే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా జాబితాలను సవరిస్తారు. ఇదే అంశంపై గత సోమవారం కలెక్టర్ కోటేశ్వరరావు రాజకీయపార్టీల నాయకులతో సమావేశం నిర్వహించిన సమయంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ లోపాలను సరిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. ఓటరు ఇంటి నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే పోలింగ్ కేంద్రం ఉండేలా చూస్తారు. మరణించిన ఓటర్ల పేర్లను సేకరించి ఓటరు జాబితాల నుంచి తొలగిస్తారు. ఓటర్ల జాబితాల్లో ఒకే ఓటరు పేరు రెండు, మూడు సార్లు నమోదై ఉంటే ఈ వివరాలు సేకరించి ఒక చోట మాత్రమే ఉంచి మిగిలిన చోట్ల తొలగిస్తారు.
జిల్లాలో 19,89,044 మంది ఓటర్లు:
జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో 19,89,044 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 9,88,831 మంది, మహిళలు 9,99,902 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇతర ఓటర్లు 311 మంది ఉన్నారు.