1995లో దానమిస్తే 2014 దాకా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదేం?

ABN , First Publish Date - 2021-03-02T08:44:24+05:30 IST

హఫీజ్‌పేటలోని అత్యంత విలువైన భూముల వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు తీరును హైకోర్టు తప్పుపట్టింది. 1955లో భూములు దానమిస్తే 2014 వరకు ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని నిలదీసింది.

1995లో దానమిస్తే 2014 దాకా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదేం?

హఫీజ్‌పేట భూములపై వక్ఫ్‌బోర్డును నిలదీసిన హైకోర్టు

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): హఫీజ్‌పేటలోని అత్యంత విలువైన భూముల వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు తీరును హైకోర్టు తప్పుపట్టింది. 1955లో భూములు దానమిస్తే 2014 వరకు ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదని నిలదీసింది. ఈ భూములపై సుప్రీంకోర్టుకు వెళితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ వ్యాజ్యంలో అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ల ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రంగారెడ్డి జిల్లా హఫీజ్‌పేటలో సర్వే నంబరు 80లోని భూములను వక్ఫ్‌ భూములుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబరు 1న నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో ఆయా భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ సాయిప్రవీణ్‌ ఎస్టేట్స్‌ సంస్థ, కె.ప్రవీణ్‌కుమార్‌, మరొకరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలు సోమవారం మరోసారి విచారణకు వచ్చాయి. దానం ఇచ్చిన వ్యక్తికి ఆ భూములపై ఉన్న హక్కు ఏమిటో గుర్తించకుండా గుడ్డిగా స్వీకరించి తమ భూములేనని వక్ఫ్‌బోర్డు చెప్పడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది.


వక్ఫ్‌బోర్డు తరఫున డీవీ సీతారామమూర్తి వాదిస్తూ.. వక్ఫ్‌నామా కింద దానమిచ్చిన భూములపై సర్వహక్కులు వక్ఫ్‌బోర్డుకే ఉంటాయన్నారు. రాజీ డిక్రీ ద్వారా ప్రత్యర్థులు భూములు పంచుకున్నారని.. అవి పిటిషనర్లవేనని చెప్పడానికి తగిన ఆధారాల్లేవని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. 1955లో అమీరున్నీసా బేగం ఈ భూములను వక్ఫ్‌బోర్డుకు దానం ఇచ్చినట్లు చెబుతున్నారని, అయితే వక్ఫ్‌నామాలో ఆమె సంతకాలు లేవని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచంద్రరావు వాదిస్తూ.. హఫీజ్‌పేట భూములు ప్రభుత్వానివేనన్నారు. డిక్రీ పొందినంత మాత్రాన వారికి హక్కులు సంక్రమించవని చెప్పారు. 

Updated Date - 2021-03-02T08:44:24+05:30 IST