అనుమానితులు బయటకు వస్తే ఫోన్ చేయండి
ABN , First Publish Date - 2020-03-30T09:48:11+05:30 IST
రాచకొండ పోలీసులు అనుమానితులను పరీక్షలకు పంపి, విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి వారి కదలికలపై నిఘా కొన సాగిస్తున్నారు.
రాచకొండ పోలీసులు
ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాచకొండ పోలీసులు అనుమానితులను పరీక్షలకు పంపి, విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి వారి కదలికలపై నిఘా కొన సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ రాచకొండ పరిధిలో దాదాపు 2094 మంది అనుమానితులు ఉన్నారని, వారిలో 1834 మందికి పరీక్షలు నిర్వహించామని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పరీక్షలు నిర్వహించిన వారిలో ముగ్గురికి కరోనా సోకినట్లు నిర్దారించామని తెలిపారు. పరీక్షల అనంతరం అనుమానితుల్లో 1771 మందిని హోం క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారిలో 991 మంది పాస్పోర్టులు జప్తు చేసి వాటిని సంబంధిత జిల్లా అధికారులకు అందించారు. ఎవరైనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినా, అనుమానితులు హోం క్వారంటైన్ నుంచి బయటికి వచ్చినా రాచకొండ కమాండ్ కంట్రోల్రూం నెంబర్ 9490617234 లేదా డయల్ 100కు ఫోన్చేసి సమాచారమందించాలని ఆయన స్థానికులను కోరారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఉండి కరోనా వ్యాప్తిని నిరోధించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.