రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలి
ABN , First Publish Date - 2022-05-25T06:35:48+05:30 IST
రాష్ట్రం అన్ని రంగాల్లోనూ బాగుపడాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందేనని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
గొలుగొండ, మే 24: రాష్ట్రం అన్ని రంగాల్లోనూ బాగుపడాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాల్సిందేనని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలో మంగళవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్రెడ్డి పాలనలో అప్పుల పాలైన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. వైసీపీ పాలనతో ప్రజలు, వైసీపీ నాయకులు కూడా విసుగు చెందుతున్నారన్నారు. వైసీపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 25 వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశామని, ఇప్పుడు ఏ గ్రామంలోనైనా సిమెంట్ రోడ్డు వేశారా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు చిటికెల తారకవేణుగోపాల్, నాయకులు చిటికెల సాంబమూర్తి, సుర్ల బాబ్జీ, పారేపల్లి నాగేశ్వరరావు, కొల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
రోలుగుంట నాయకత్వాన్ని మార్చుకోండి
చోడవరం: ‘‘చాలామంది నాయకులు అలసత్వం గా ఉంటున్నారు. ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదు. ప్రత్యేకించి రోలుగుంట మండలంలో నాయకత్వం సరిగా లేదు. అక్కడ వెంటనే మార్పులు చేయాలి’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చోడ వరం నియోజకవర్గం నేతలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం రాత్రి స్థానికంగా నిర్వహించిన మినిమహానాడులో ఆయన మాట్లాడుతూ, పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడంతోపాటు, వారికి అండగా నిలబడాలని సూచించారు. పోలీసు కేసులకు భయపడే నాయకులను పక్కనపెట్టి, ధైర్యంగా పనిచేసే వారికి నాయకత్వం అప్పగించాలని స్పష్టం చేశారు.