మార్పు రాకపోతే సాగనంపుడు ఖాయం: Vijayashanti
ABN , First Publish Date - 2022-06-28T02:32:50+05:30 IST
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్పై ఫైరయ్యారు. సర్కారు దవాఖానాల్లో ప్రజలకు సరిగా వైద్యం అందడం లేదని ఘాటుగా
Hyderabad: బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్పై ఫైరయ్యారు. సర్కారు దవాఖానాల్లో ప్రజలకు సరిగా వైద్యం అందడం లేదని ఘాటుగా విమర్శించారు. తీరు మారకపోతే తెలంగాణ ప్రజానీకం గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.
వైద్యం అందించలేని ఈ సర్కార్ ఉంటే ఎంత? లేకుంటే ఎంత?..
‘‘తెలంగాణలో వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 36.2 శాతం ప్రజలు మాత్రమే ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకుంటున్నారని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) సర్వేలో తేటతెల్లమైంది. మిగతా 63.8 శాతం ప్రజలు ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. దేశంలో సగం మంది అంటే, 49.9 శాతం ప్రజలు ప్రభుత్వ దవాఖానాలకు పోతుండగా, మన రాష్ట్రం దేశ సగటు కంటే వెనుకబడి ఉందని ఆ సర్వే పేర్కొంది. దేశంలో చివరి నుంచి నాలుగో స్థానంలో మన రాష్ట్రం ఉంది. ఇది వినడానికే సిగ్గుగా ఉంది. కనీసం పేదలకైనా వైద్యం అందించలేని ఈ సర్కార్ ఉంటే ఎంత? లేకుంటే ఎంత?... ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లకపోవడానికి జనం చెప్పిన కారణాలను కూడా సర్వే వెల్లడించింది. పేషెంట్లను అస్సలు పట్టించుకోరని, కేర్ తీసుకోరని రాష్ట్రంలో సగం మంది చెబుతున్నారు. తాము ఉంటున్న ప్రాంతంలో ప్రభుత్వ దవాఖాన అందుబాటులో లేకపోవడం వల్లే ప్రైవేటు హాస్పిటళ్లను ఆశ్రయించాల్సి వస్తోందని 40 శాతం మంది చెప్పారు. ప్రభుత్వ దవాఖానాలను రాత్రి పూట మూసేయడం, డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, గంటలకొద్ది వెయిట్ చేయించడం, టెస్టుల కోసం రోజుల తరబడి తిప్పించడం, హాస్పిటల్లో ఉండే అపరిశుభ్రత తదితర కారణాలను ఎక్కువ మంది చెబుతున్నారు. ఏం కేసీఆర్ సారు?... సర్కార్ దవాఖానాల్లో సౌకర్యాలు కల్పించామని గొప్పలు చెప్పుకుంటారు ... ఇప్పుడు దీనికి నీ సమాధానం ఏంటి? ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు కల్పించు. లేదంటే పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కేసీఆర్ సర్కార్కి తెలంగాణ ప్రజానీకం గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం.’’ అని పేర్కొన్నారు.