కొడాలి, అంబటి, వంశీ వ్యాఖ్యలతో పార్టీ పతనమే.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-19T08:43:49+05:30 IST

కొడాలి, అంబటి, వంశీ వ్యాఖ్యలతో పార్టీ పతనమే.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

కొడాలి, అంబటి, వంశీ వ్యాఖ్యలతో పార్టీ పతనమే.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

10 నుంచి 20 శాతం ఓట్లు గల్లంతు 

మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు

టీడీపీ వస్తే వెంటబడి కర్రలతో కొడతారు

ఈ విషయాలు చెప్పేందుకు అందరికీ భయం 

ఈ వీడియోను సీఎం పేషీకి కూడా పంపుతా

ఒంగోలులో బాలినేని జన్మదిన కార్యక్రమంలో 

 సంచలన వ్యాఖ్యలు

సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ 


ఒంగోలు (కలెక్టరేట్‌), డిసెంబరు 18: ‘‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం ఖాయం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు’’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఏ సామాన్య వ్యక్తో లేక ప్రతిపక్ష నాయకుడో కాదు.. వైసీపీ నాయకుడే సొంత పార్టీ నేతల తీరుపై ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నేతలు తీరు మార్చుకోకపోతే పార్టీకి భారీ నష్టమని, ఓడిపోతే కార్యకర్తలు ఇబ్బందులు పడతారని అన్నారు. ‘‘ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద వీరుడంటారు. అప్పట్లో 35 వేలతో ఓడిపోయాడు. మొన్న జగనన్న వేవ్‌తో మళ్లీ గెలిచాడు.


జనసేన పార్టీ ఆడవాళ్ల జోలికిపోయాడు. చివరకు విజయసాయిరెడ్డిని కొట్టేకాడికి జనసేన పార్టీ వాళ్లు వచ్చారంటే మనం చేసిన చెడ్డ పనులు వల్లనే. పార్టీలో ఉంటూ కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పార్టీకి మిత్రులా, శత్రువులా, కోవర్టు ఆపరేషనా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పనిచేస్తే పార్టీతో పాటు అందరికీ మేలు జరుగుతుంది. ఇదేవిధంగా వ్యవహరిస్తే తీవ్ర నష్టం ఖాయం. ఈ సారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు. పార్టీలో పదవులు ఉన్నా లేకపోయినా నేను వాసన్న, జగనన్న అభిమానిగా ఉంటాను. నాలాగా అందరూ ఎందుకు ఉంటారు. సమర్థులకు పదవులు లేవు వాసన్నా (బాలినేని).. నీ చుట్టూ తిరుగుతూ పొగడేవాళ్లకే ఇస్తున్నారు. నీ వెంట ఉన్నవారినే నాయకులు, కార్యకర్తలుగా గుర్తిస్తున్నారు. నీకోసం కష్టపడి పనిచేసిన వారిని విస్మరిస్తే భవిష్యత్‌ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. పార్టీలో ఉంటూ మీకు చెప్పేందుకు భయపడుతున్నారు. నాకు ఎలాంటి భయంలేదు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా తెలుసుకొని మేల్కోవాలి. ఓడిపోతే కార్యకర్తలు ఇబ్బందులు పడతారు.


ఈసారి పాదయాత్ర కూడా చేయనివ్వరు. నాయకుల మాటలతో ఓట్లు పోతాయి. ఇక పార్టీలో ఎవరూ ఉండరు. ఈ విషయాలను చెప్పేందుకు అందరూ భయపడుతున్నారు. అయినా నేను ఈ వీడియోను ముఖ్యమంత్రి పేషీకి కూడా పంపుతాను. నాపై కాకుండా, తప్పు చేసే వాళ్లపై యాక్షన్‌ తీసుకుంటే పార్టీ బాగుపడుతుంది. పార్టీని కాపాడుకునేందుకు ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకొకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది’’ అని సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యల వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T08:43:49+05:30 IST