సీసీఐపై ఆశలు గల్లంతే!
ABN , First Publish Date - 2022-05-18T05:32:11+05:30 IST
జిల్లా కేంద్రంలోని సీసీ ఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పరిశ్రమ పునరు ద్ధరణ ఆశలు ఇక గల్లంతేనని స్పష్టమవుతోంది.
పరిశ్రమ ఆస్తుల వేలానికి టెండర్లను ఆహ్వానించినసీసీఐ
పునరుద్ధరణ సాధ్యం కాదని ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
ఫలించని అధికార పార్టీ నేతల ప్రయత్నాలు
కేంద్ర నిర్ణయంతో ఇరుకున పడ్డ కమలం పార్టీ నేతలు
అయోమయంలో కార్మికులు.. మండిపడుతున్న సాధన కమిటీ
ఆదిలాబాద్, మే17(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సీసీ ఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పరిశ్రమ పునరు ద్ధరణ ఆశలు ఇక గల్లంతేనని స్పష్టమవుతోంది. ఇన్నాళ్లు పరి శ్రమను పునరుద్ధరించేందుకు జరిగిన అన్ని రకాల ప్రయ త్నాలు విఫలమయ్యాయి. సిమెంట్ పరిశ్రమను పూర్తిగా ఎత్తి వేసేందుకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ ఆస్థులతో పాటు భారీ యంత్ర సామగ్రిని వేలం వేసేందుకు సీసీఐ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమ నష్టాల్లో కూరుకు పోవడం తోపాటు పెద్ద ఎత్తున వివిధ రకాల అప్పుల భారం పెరిగి పోవడం, యంత్ర సామగ్రి కూడా పాడై పోవడంతో తిరిగి పునరుద్ధరణ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కేంద్ర ప్రభుత్వం భావించింది. మూడేళ్ల క్రితమేసీసీఐ కేంద్ర ప్రభుత్వానికి పరిశ్రమకు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చింది. అప్పట్లోనే పరిశ్రమను పునరుద్ధరించ లేమంటూ కేంద్ర భారీ ప రిశ్రమల శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో స్ప ష్టం చేశారు. కోట్ల రూపాయల అప్పు భారం పెరిగిపో వ డంతో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం కేంద్ర ప్ర భుత్వం ప క్కన పెడుతూవచ్చింది. తాజాగా సీసీఐ పరిశ్రమ ఆస్తులు, భారీయంత్ర సామగ్రిని వేలం వేసేందుకు బిడ్డర్ల నుంచి టెం డర్లను ఆహ్వానించింది. ఈ నెల 23 వరకు ఈ టెండర్లను వే సేందుకు అవకాశం కల్పించింది. మరో మూడు నాలుగు నెల ల్లో టెండర్లను తెరిచి వేలం ప్రక్రియను ప్రారంభించనుంది. గతంలోనే ఉమ్మడి హైకోర్టు 3 నెలల గడువును విధిస్తూ వేలం పాట నిర్వహించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఆస్తులను ఇతరు లకు అప్ప గించరాదంటూ ఆదేశాలు జారీ చే సింది. అయితే కోర్టు ఇచ్చిన గడువు కూడా ముగిసి పోవ డంతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరిశ్రమను ఎత్తి వేసేందుకే సిద్ధమైంది. దీంతో కార్మిక సంఘాలు సాధన కమిటీ ఆధ్వర్యం లో మంగళవారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఇక జి ల్లాలో సీసీఐ పరిశ్రమ చరిత్రగానే మారిపోనుంది. సీసీఐ ప రిశ్రమ పునరుద్ధరణ సాధ్యం కాదంటూ, కేంద్ర ప్రభుత్వం ప రిశ్రమను ఎత్తి వేసే దిశగానే అడుగులు వేస్తుందంటూ గతం లోనే ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. ఊహిం చిన విధంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కార్మిక కుటుంబాలు అయోమయానికి గురవుతున్నాయి.
ఫలించని నేతల ప్రయత్నాలు..
సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణకు టీఆర్ఎస్ నేతలు పలురకాల ప్రయత్నాలు చేసినా ఫలించలేదనే చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కొరవడినట్లే కనిపిస్తోంది. జిల్లా విభజన తర్వాత మూతబడిన సీసీఐ పరిశ్రమను తెరిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగురామన్న అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి కేటీఆర్తో కలిసి పలుమార్లు ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్లిన ప్రయోజనం దక్కలేదు. పరిశ్రమ పునరుద్ధరణకు తమ వంతు వాటాను కూడా కేటాయిస్తామని సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రికి రాతపూర్వకంగా లేఖలు కూడా రాసిన సందర్భాలున్నాయి. అయినా పరిశ్రమ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపించలేదు. గతంలో ఉమ్మడి హైకోర్టు 3 నెలల గడువు సమయాన్ని ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరక పోవడంతో సీసీఐ పరిశ్రమ ఆస్తులను వేలం వేసేందుకు నిర్ణయం తీసుకుంది. మూడు నెలల క్రితం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్చౌక్లో రిలే దీక్షలను చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. నిరాహార దీక్షను ఎత్తి వేసిన నెల రోజులకే పరిశ్రమ ఆస్థుల వేలానికి నిర్ణయం తీసుకోవడం కార్మిక సంఘాలను నిరాశకు గురి చేస్తుంది.
ఇబ్బందికరంగా మారిన కేంద్ర నిర్ణయం..
సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించి ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేసినా తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయి. జిల్లాలో బీజేపీ అభ్యర్థిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినా కేంద్ర ప్రభుత్వం మాత్రం కనికరం చూపించ లేదు. పలుమార్లు కార్మిక నేతలతో కలిసి జిల్లా బీజేపీ నేతలు కేంద్ర మంత్రులతో పాటు ఇతర ముఖ్య నేతలను కలిసి సీసీఐ పరిశ్రమ పునరుద్ధరనపై సంప్రదిం పులు జరిపారు. పలుమార్లు పార్లమెంట్ సమావేశాల్లోనూ ఎంపీ సోయంబాపురావు సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ అం శాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎంపీ అభ్యర్థనను కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. జిల్లా బీజేపీ నేతల అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకొని సాను కూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తమైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఊహించని రీతిలో పరిశ్రమ ఎత్తి వేసే దిశగా అడుగులు వేయడంతో బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బీజేపీని ఇరకాటంలో పడేసింది. ఎలాగైనా సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించిన బీజేపీకి భారీ షాకే తగిలింది. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్లయింది. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో కార్మిక కుటుంబాలు అయోమయానికి గురవుతున్నాయి. జిల్లా విభజన తర్వాత భారీ పరిశ్రమలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయక పోయిన ఉన్న పరిశ్రమలైనా పునరుద్ధరించక పోవడం దురదృష్టకరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
న్యాయ పోరాటం చేస్తాం..
- ఎస్.విలాస్ (ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి)
ఎన్నో ఏళ్లుగా మూతబడిన సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. అయిన కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను ఎత్తి వేసేందుకు నిర్ణయం తీసుకోవడం బాధాకరం. ఆస్తుల వేలానికి నోటిఫికేషన్ విడుదల చేయడం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. సీసీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మళ్లీ న్యాయపోరాటం చేస్తాం. సిమెంట్ పరిశ్రమను ఎత్తి వేస్తే మళ్లీ కొత్త పరిశ్రమలు రావడం ఇబ్బందికరంగానే ఉంటుంది. పరిశ్రమను నెలకొల్పేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆస్థులను వేలం వేసేందుకు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. గతంలో ఉమ్మడి హైకోర్టు 3 నెలల గడువును ఇచ్చింది. అయినా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించ లేదు.