జిన్నా తొలి ప్రధాని అయితే?: రాజ్భర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-11-10T22:46:37+05:30 IST
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికల పడుతున్న తరుణంలో పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ ఆలీ..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికల పడుతున్న తరుణంలో పాకిస్థాన్ జాతిపిత మహమ్మద్ ఆలీ జిన్నా ప్రస్తావన మరోసారి నేతల మాటల్లో చోటుచేసుకుంది. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో జిన్నా పేరు ప్రస్తావించగా, తాజాగా ఆ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్న సుహల్దేవ్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్భర్ సైతం జిన్నా పేరు లేవనెత్తారు.
''జిన్నా తొలి ప్రధాని అయి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదు. అడ్వాణీ వ్యాఖ్యలు చదవండి. అటల్జీ అభిప్రాయాలు చూడండి, వీరంతా జిన్నాను ఎందుకు ప్రశంసించారు?'' అని రాజ్భర్ గతంలో ఆ నేతలు ఇద్దరూ చేసిన వ్యాఖ్యలను మీడియాతో మాట్లాడుతూ గుర్తుచేశారు. జిన్నా తొలి ప్రధాని అయి ఉంటే అసలు దేశ విభజనే జరిగి ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
దీనికి ముందు, అఖిలేష్ యాదవ్ సైతం జిన్నాను సర్దార్ పటేల్, మహాత్మాగాంధీతో పోల్చారు. హర్దోయ్లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో అఖిలేష్ మాట్లాడుతూ, సర్దార్ పటేల్కు వాస్తవ పరిస్థితులు తెలుసు కాబట్టే అందుకు అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని, అందుకే ఆయన ఉక్కు మనిషిగా గుర్తింపు పొందారని అన్నారు. పటేల్, జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, జిన్నా ఒకే ఇన్స్టిట్యూట్లో చదవి, బారిస్టర్లు అయ్యారని అన్నారు. దేశ విముక్తికి వారు పాటుపడ్డారని, ఏ పోరాటం చేసినా వారు మడం తిప్పిందే లేదని పేర్కొన్నారు.