కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే.. ఇంట్లోనే ఉండాలి
ABN , First Publish Date - 2022-05-25T05:21:44+05:30 IST
కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే.. ఇంట్లోనే ఉండాలి
- టీపీసీసీని విమర్శించే స్థాయి నీకు లేదు
- ఆక్రమణలకు నీవే సూత్రధారివి
- జవహర్నగర్ భూముల్లో ఆస్పత్రి కట్టావ్..
- మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేతలు నందికంటి శ్రీధర్, వజ్రేష్యాదవ్ల ధ్వజం
మేడ్చల్ అర్బన్, మే 24 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడితే.. లుంగీ కట్టుకుని ఇంట్లోనే ఉండాల్సొస్తదని మంత్రి మల్లారెడ్డిపై డీసీసీ (మేడ్చల్-మల్కాజిగిరి) అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మేడ్చల్ నియోజకవర్గ సమన్వయకర్త వజ్రే్షయాదవ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకుతింటున్నాడని వారు ఆరోపించారు. మంగళవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలోని ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి.. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవులను కొనుక్కున్న నీచుడివంటూ మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడం మొదలుపెడితే లుంగీ కట్టుకుని ఇంట్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. కంటోన్మెంట్ బంగ్లాను కమర్షియల్గా మార్చి వాడుకుంటున్నావని, జవహర్నగర్ భూముల్లో ఆస్పత్రి నిర్మించింది నిజం కాదా అని ప్రశ్నించారు. మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్లో రైతుల భూములు సుమారు 3వేల ఎకరాలు ఉండగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను వేరుచేసి నక్ష రూపొందించాలనే సోయి లేదా? అని దుయ్యబట్టారు. ఆగ్రామ రైతులకు ఇప్పటికీ పట్టాదారు పాస్పుస్తకాలు అందకపోవడంతో రైతుబంధు, రైతుబీమా డబ్బులు చేతికి అందడం లేదన్నారు. గుండ్లపోచంపల్లి పార్కును కబ్జాచేసి అందులోంచి రోడ్డు వేసుకున్నావని, అక్రమాలు, ఆక్రమణలు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో పిచ్చికుక్కను తరిమినట్లు తరమడం ఖాయమని మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మంత్రి ఒప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరిత, పార్టీ కీసర అధ్యక్షుడు కృష్ణాయాదవ్, నాయకులు రామారావు, శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.