Farooq Abdullah Vs Mehbooba Mufti : హిందువులు అజ్మీర్ దర్గాకు వెళ్తే... ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2022-09-21T16:47:49+05:30 IST

పాఠశాలల్లో భజన పాటలను పాడాలని జమ్మూ-కశ్మీరు (Jammu and

Farooq Abdullah Vs Mehbooba Mufti : హిందువులు అజ్మీర్ దర్గాకు వెళ్తే... ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు...

శ్రీనగర్ : పాఠశాలల్లో భజన పాటలను పాడాలని జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) తప్పుబట్టారు. ద్విజాతి సిద్ధాంతాన్ని తాము నమ్మబోమని చెప్పారు. భారత దేశం మత రాజ్యం కాదని, ఇది లౌకిక రాజ్యమని చెప్పారు. 


ఓ వార్తా సంస్థ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం, మెహబూబా ముఫ్తీ  (Mehbooba Mufti) వ్యాఖ్యలను ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) వ్యతిరేకించారు. తాను ద్విజాతి సిద్ధాంతాన్ని విశ్వసించనని చెప్పారు. భారత దేశం మత (communal ) రాజ్యం కాదని, ఇది లౌకక (secular) రాజ్యమని చెప్పారు. ‘‘నేను భజన పాట పాడుతాను. నేను భజన పాట పాడటం తప్పు అవుతుందా ? ’’ అని ఫరూఖ్ ప్రశ్నించారు. ఓ హిందువు అజ్మీర్ దర్గా (Ajmer Dargah)కు వెళ్తే, ఆ హిందువు ముస్లిం అయిపోతారా? అని ప్రశ్నించారు. 


మహాత్మా గాంధీ ఎంతో ఇష్టపడే పాట ‘రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్‌కో సన్మతి దే భగవాన్’ను ఓ పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థుల చేత పాడిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోను మెహబూబా ముఫ్తీ సోమవారం ట్వీట్ చేశారు. ఈ పాఠశాల కశ్మీరులో ఉందని, ఆ పాఠశాల సిబ్బంది బాలబాలికల చేత ఈ పాటను పాడిస్తున్నారని ఆమె తెలిపారు. మత పెద్దలను జైలులో పెట్టారని, జామా మసీదును మూసేశారని, ఇక్కడి (కశ్మీరులోని) పాఠశాల విద్యార్థినీ, విద్యార్థుల చేత హిందూ పాటలను పాడిస్తున్నారని, దీనినిబట్టి కశ్మీరులో భారత ప్రభుత్వ హిందుత్వ ఎజెండా నిజ స్వరూపం బయటపడుతోందని ఆరోపించారు. ఈ మతఛాందస ఆదేశాలను తిరస్కరిస్తే ప్రజా భద్రత చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ప్రకారం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ‘మారుతున్న జమ్మూ-కశ్మీరు’ అని గొప్పగా చెప్పుకుంటున్నదాని కోసం తాము చెల్లిస్తున్న మూల్యం ఇదేనని మండిపడ్డారు. 


ఇలాంటి రాజకీయాలు తగదు : బీజేపీ

బీజేపీ జమ్మూ-కశ్మీరు శాఖ అధ్యక్షుడు రవీందర్ రైనా (Ravinder Raina) మాట్లాడుతూ, మెహబూబా ముఫ్తీ పసి హృదయాల్లో విషం నింపుతున్నారని మండిపడ్డారు. ఆమె ఇలాంటి రాజకీయాలను మానుకోవాలని అన్నారు. కశ్మీరులో ఆమె పట్టు కోల్పోయారన్నారు. కశ్మీరు లోయ ప్రజలు ఆమెను తిరస్కరించారని చెప్పారు. తన పట్టును మళ్లీ సాధించాలనే లక్ష్యంతోనే ఆమె ఇలాంటి కుట్రకు తెర తీశారని చెప్పారు. 


మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యల్లో నిజం ఎంత?

జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, వచ్చే నెల 2న మహాత్మా గాంధీ 153వ జయంత్యుత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన ‘‘రఘుపతి రాఘవ రాజారాం...’’ పాటను కూడా విద్యార్థినీ, విద్యార్థులకు నేర్పిస్తున్నారు. ఈ సంబరాల్లో అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. 




Updated Date - 2022-09-21T16:47:49+05:30 IST