అదనపు క్వారంటైన్ కేంద్రాల గుర్తింపు
ABN , First Publish Date - 2020-04-10T11:14:32+05:30 IST
కరోనా రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ముమ్మరం చేస్తోంది.
వసతుల కల్పనలో అధికారుల నిమగ్నం
మదనపల్లె, ఏప్రిల్ 9: కరోనా రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ముమ్మరం చేస్తోంది. అదనంగా క్వారంటైన్ కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇందుకు మదనపల్లె, తంబళ్లపల్లె నియోజక వర్గాల్లోని కల్యాణమండపాలు, కస్తూర్బా గురుకుల పాఠ శాల, మోడల్ స్కూళ్లను గుర్తించారు. మదనపల్లెలోని చౌడేశ్వరి, మల్లికార్జున, మాలిక్, బుగ్గకాలువలోని ఎన్వీఆర్ కల్యాణ మండపం, ఆర్యవైశ్య హాస్టల్, తిరుపతిరోడ్డులోని పద్మావతి కల్యాణ మండపాలను ఎంపిక చేశారు. నిమ్మనపల్లె మండలంలో రెడ్డివారిపల్లె సమీపంలోని మోడల్ స్కూల్ను గుర్తించారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోటలో కస్తూర్బా గురుకుల పాఠశాల, తంబళ్లపల్లె మండలంలో ఏపీ మోడల్ స్కూల్(ఆదర్శపాఠశాల), ములకలచెరువు మండలంలోని బురకాయలకోట గురుకుల పాఠశాల, పెద్దమండ్యం మండలంలోని మోడల్ స్కూల్స్ను ఎంపిక చేశారు. ఇప్పటికే ఆయా యజమానుల నుంచి అనుమతి తీసుకుని ప్రభుత్వానికి నివేదించారు. వీటిల్లో వసతులు కల్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.