ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,882 కోట్లు

ABN , First Publish Date - 2020-11-01T08:37:20+05:30 IST

ఐసీఐసీఐ బ్యాంక్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కీలక ఆదాయాల్లో వృద్ధి సహా మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు గణనీయంగా తగ్గటంతో జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏకంగా నాలుగింతలు వృద్ధి చెంది రూ.4,882 కోట్లుగా నమోదైంది...

ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం రూ.4,882 కోట్లు

ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. కీలక ఆదాయాల్లో వృద్ధి సహా మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు గణనీయంగా తగ్గటంతో జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏకంగా నాలుగింతలు వృద్ధి చెంది రూ.4,882 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం  రూ.1,131 కోట్లుగా ఉంది. స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన నికర లాభం రూ.655 కోట్ల నుంచి రూ.4,251 కోట్లకు పెరిగింది. ఈ స్థాయిలో నికర లాభాన్ని ప్రకటించటం ఐసీఐసీఐ బ్యాంక్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.


సమీక్షా కాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం ఏకంగా 16 శాతం వృద్ధి చెంది రూ.9,366 కోట్లుగా నమోదైంది. ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు సాధారణ స్థాయిలకు చేరుకుంటుండటంతో అన్ని రంగాల్లో రుణాలకు డిమాండ్‌ ఏర్పడుతోందని బ్యాంక్‌ పేర్కొంది.

కాగా త్రైమాసిక కాలంలో మొండి పద్దుల కోసం చేసిన కేటాయింపులు రూ.2,995 కోట్లుగా ఉన్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ కేటాయింపులు రూ.7,593 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు పన్ను వ్యయాలను తగ్గించుకోవటం కూడా లాభదాయకత పెరగటానికి దోహదపడిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. త్రైమాసిక కాలంలో దాదాపు రూ.1,400 కోట్ల రుణాలు నాన్‌ పెర్‌ఫార్మింగ్‌ అడ్వాన్స్‌ల్లోకి  చేరిపోయాయని తెలిపింది. కాగా మొత్తం మొండి పద్దులు రూ.3,017 కోట్లుగా ఉండగా అందులో రిటైల్‌ రుణాల వాటా రూ.1,700 కోట్లుగా ఉందని పేర్కొంది. 


Updated Date - 2020-11-01T08:37:20+05:30 IST