వాయిదా..లాంఛనమే
ABN , First Publish Date - 2020-05-28T08:51:42+05:30 IST
ఈఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ వాయిదా.. ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహణ.. ఇది కొంతకాలంగా జరుగుతున్న చర్చ...
పొట్టి ప్రపంచ క్పపై ఐసీసీ నిర్ణయం నేడు
న్యూఢిల్లీ: ఈఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ వాయిదా.. ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహణ.. ఇది కొంతకాలంగా జరుగుతున్న చర్చ. దీనిపై గురువారం జరిగే ఐసీసీ బోర్డు కీలక సమావేశం అనంతరం స్పష్టత రానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ వాయిదాకే ఐసీసీ మొగ్గుచూపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ‘టీ20 వరల్డ్ కప్ను వాయిదా వేస్తూ సమావేశంలో దాదాపు నిర్ణయం తీసుకోవడం ఖాయం. అయితే దానిని అధికారికంగా ప్రకటిస్తారా, లేదా అన్నదే ప్రశ్న’ అని ఐసీసీ సభ్యుడొకరు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాయని తాను అనుకోవడంలేదని ఆయన అన్నారు. ఇక.. ఈసారి టీ20 ప్రపంచ కప్ను 2022 అక్టోబరు/నవంబరులో నిర్వహించడం, 2021 టీ20 వరల్డ్ కప్ను భారత్లో యధాప్రకారం జరపడమనే ప్రతిపాదనను ఐసీసీ ఈవెంట్స్ కమిటీ బోర్డు భేటీలో చేయనుంది. ఐసీసీ చైర్మన్ ఎన్నికపైనా సమావేశంలో చర్చించనున్నారు. చైర్మన్గా కొలిన్ గ్రేవ్స్ను బరిలోకి దింపాలని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అయితే బీసీసీఐ చీఫ్ గంగూలీ పోటీపడాలని భావిస్తే పరిస్థితులు మారిపోవడం ఖాయం.