శివసేన పుట్టక ముందే బీజేపీ ఉంది: ఫడ్నవిస్

ABN , First Publish Date - 2022-01-24T19:38:50+05:30 IST

బీజేపీ కూటమిలో ఉండి 25 ఏళ్ల కాలం శివసేన వృథా చేసుకుందని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన ..

శివసేన పుట్టక ముందే బీజేపీ ఉంది: ఫడ్నవిస్

ముంబై: బీజేపీ కూటమిలో ఉండి 25 ఏళ్ల కాలం శివసేన వృథా చేసుకుందని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తిప్పికొట్టారు. శివసేన పుట్టక ముందే బీజేపీ ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. ''ఆ పార్టీకి (శివసేన) నేను ఒక విషయం గుర్తుచేయాలని అనుకుంటున్నాను. ఆ పార్టీ పుట్టక ముందే ముంబైలో బీజేపీ కార్పొరేటర్ ఒకరు ఉన్నారు'' అని అన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పటి ర్యాంకు కంటే ఇప్పుడు శివసేన ర్యాంకు దారుణంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీతో శివసేన కలిసి ఉన్నప్పటి వరకూ ఆ పార్టీ ఒకటి, లేదా రెండో స్థానంలో ఉండేదని, ఇప్పుడు ఆ పార్టీ నెంబర్-4కు పడిపోయిందని చెప్పారు.


బాల్ థాకరే 96వ జయంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారంనాడు మాట్లాడిన ఉద్ధవ్ థాకరే... బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ తరహాలా హిందుత్వాన్ని అధికారం కోసం శివసేన ఎన్నడూ వాడుకోలేదని, ఆ పార్టీకి తాము దూరమైనా హిందుత్వానికి దూరం కాలేదని అన్నారు. తమకు బీజేపీనే వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సైతం బీజేపీపై విమర్శలు కొనసాగించారు. ఎక్కడో అట్టడుగున ఉన్న బీజేపీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లింది తమ పార్టీయేనని అన్నారు. బాబ్రీ ఉదంతం తర్వాత ఉత్తరభారతంలో శివసేన పవనాలు బలంగా వీచాయని, ఆ దశలో ఎన్నికలకు వెళ్లి ఉంటే శివసేన ప్రధానే దేశాన్ని ఏలేవాడని, అయితే ఆ అవకాశాన్ని తాము బీజేపీకి ఇచ్చామని చెప్పారు.

Updated Date - 2022-01-24T19:38:50+05:30 IST