అధిష్ఠానం ఇచ్చిన హామీని చెప్పలేను

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

అధిష్ఠానం ఇచ్చిన హామీని చెప్పలేను

అధిష్ఠానం ఇచ్చిన హామీని చెప్పలేను
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

  •   గెలుపు గుర్రాలకే టికెట్లు 
  •  అనుభవం లేని వ్యక్తులతో పరుగెత్తలేను
  •   సీఎం సభకు లక్ష మందితో జనసమీకరణ
  •  మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి 

 తాండూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోత) తాండూరు ఎమ్మెల్యే టికెట్‌ విషయంలో అధిష్ఠానం ఇచ్చిన హామీని మీడియాకు వెల్లడించలేనని మాజీమంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఖాయమని, జిల్లాలో ఎవరికి పార్టీ తరఫున టికెట్‌ ఇచ్చినా గెలిపించే బాధ్యత నాపై ఉందని అన్నారు. జిల్లాలో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునని, అనుభవం లేని వ్యక్తులతో పోటీపడి తానుపరుగెత్తలేనని వెల్లడించారు. తాండూరు, వికారాబాద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల రాజీనామా వ్యవహారం జిల్లాకు సంబంధించినది కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఒప్పందాలు ఉన్న మున్సిపాలిటీలు 12వరకు ఉన్నాయని తెలిపారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకునేది జిల్లా నాయకత్వమేనని, ఈ విషయం అధిష్ఠానం ఎప్పుడో చెప్పిందని ఎమ్మెల్సీ అన్నారు. కాగా, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు రాజీనామా చేసేందుకు ఆసక్తి చూపడం లేదని, మున్సిపల్‌, జడ్పీ చైర్‌పర్సన్ల వ్యవహారంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల జోక్యం ఉండదని పేర్కొన్నారు. కాగా, రేపు(16న) ముఖ్యమంత్రి కేసీఆర్‌ వికారాబాద్‌కు రానున్నందున జిల్లావ్యాప్తంగా లక్ష మందితో జన సమీకరణ చేస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ఇప్పటికే ముఖ్యమంత్రి అనేక నిధులు ఇచ్చారని, మరిన్ని నిధులు రాబట్టేందుకు సీఎంకు విన్నవిస్తామని చెప్పారు. తాండూరులో పారిశ్రామిక వాడను నేనే మంజూరు చేయించానని తెలిపారు. అదేవిధంగా తాండూరులో మెడికల్‌ కళాశాల, రాయల్టీ తగ్గింపు, కందిబోర్డు ఏర్పాటు, వికారాబాద్‌లో ఫ్లైఓవర్‌, రింగ్‌రోడ్డు, అనంతగిరి పర్యాటక కేంద్రం ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, రవిగౌడ్‌, విష్ణువర్దన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి,  వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్‌ శోభారాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST